సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వుండాలి అని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ విషయం పై వైద్య పంచాయితీరాజ్ మున్సిపల్ శాఖలను ఆదేశించారు. వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున, ముందస్తు నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి, అధికారులు, వైద్యశాఖ, మున్సిపల్ శాఖల అధికారులతో ప్రగతి భవన్ లో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా వుండాలని, అనుమానితులకు తక్షణమే జ్వర పరీక్షలు చేసి నిర్దారించుకోవాలన్నారు. అందుకు సంబంధించి అన్ని దవాఖానాలను పరీక్షలు, చికిత్సకు సంబంధించి పూర్తిస్తాయిలో ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రతను కాపాడే చర్యలు తీసుకోవాలని పంచాయితీ రాజ్ మున్సిపల్ శాఖల అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గ్రామాల్లో పట్టణాల్లో దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నీరు నిల్వవుండకుండా చూడాలన్నారు. ఐఆర్ఎస్ , ఫాగింగ్ తదితర లార్వా నియంత్రణ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలన్నారు. అవసరమైన మేర మందులు ఇతర సామాగ్రిని సమకూర్చుకోవాలని సిఎం అన్నారు. వారి వారి నివాసాల్లో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని, దోమకాటు బారిన పడకుండా పిల్లలు వృద్ధులను కాపాడుకోవాలని అందుకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. ఈ వానాకాలం సీజన్ ముగిసే వరకు వైద్యాశాఖ, పంచాయితీ రాజ్, మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా వుంటూ సీజనల్ వ్యాధులను నియంత్రించే చర్యలు చేపట్టాలన్నారు సీఎం కేసీఆర్.