మంత్రి హరీష్రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు.. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్ల పల్లిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. హరీష్ అన్న బాగా ఎగురుతున్నావట ఆరు నెలల తర్వాత నిన్ను కూడా అవతల పెడతారు అని వ్యాఖ్యానించారు.. అంతే కాదు.. అప్పుడు హరీష్ అన్నని గెలిపించాలని మళ్లీ మన యువకులు తిరగాల్సి వస్తది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, ఈటల రాజేందర్ ను రాత్రికి రాత్రి ఎందుకు బయటకు పంపించాల్సి వచ్చిందని ప్రశ్నించిన ఆయన.. మిగతా ఎమ్మెల్యేల లాగా దోచుకోవడం దాచుకోవడం డబ్బులు కూడగట్టుకునే వాడైతే ఐదేళ్లుగా మంత్రిగా ఉండేవాడన్నారు.. గరీబోళ్ల వైపు పేదల వైపు మాట్లాడిండు ఈటెల రాజేందర్.. దుబ్బాకలో రఘునందన్ రావు గెలిస్తే పింఛన్ కట్ అయితుందని హరీష్ రావు చెప్పిండు.. సంవత్సరం పూర్తయింది కానీ ఒక్క పింఛన్ ఇప్పటికీ కట్ కాలేదన్నారు.
కేసీఆర్, హరీష్ రావు ఇంట్లో నుండి మనకు పింఛన్ ఇవ్వట్లేదు మనం కట్టిన పన్నుల నుండే వస్తున్నాయన్నారు రఘునందన్.. ఇంట్లో ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటే ఒకరికి పింఛన్ వస్తే ఇంకొకరికి రావడం లేదన్న ఆయన.. కొడుక్కు మంత్రి పదవి, అల్లుడికి మంత్రి పదవి, బిడ్డకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు కేసీఆర్.. పొద్దున మధ్యాహ్నం రాత్రి గోలీలు అందించే సంతోష్ కు అడగగానే ఎంపీ పదవి ఇచ్చారని విమర్శించారు.. డబ్బులన్నీ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు కేటాయిస్తే హుజరాబాద్ లో ఈటల రాజేందర్ ఇండ్లు ఎలా కట్టిస్తాడు? అని ప్రశ్నించిన ఆన.. ఆర్థిక మంత్రి, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కే డబ్బులు ఇవ్వకపోతే.. గెల్లు సీనుకు ఎట్లా ఇస్తాడు? అని నిలదీశారు.. ఇక్కడి నుండి అక్కడి వరకు 102 మంది ఉన్నారు.. గెల్లు గెలిస్తే 103 వ్యక్తి అవుతాడు.. లైన్లో నిలబడితే గెల్లు కనిపిస్తాడా? గెల్లు శీను వంతు వచ్చేసరికి మళ్లీ ఎలక్షన్లు వస్తాయి ఒక్కసారి ఆలోచించండి అని సూచించారు.