తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఎప్పటివో అయినా.. ఈ మధ్య తరచూ విమర్శలు, ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ… మీకు నిజాయితీ ఉంటే అక్రమంగా చేపట్టిన ఆర్డీఎస్ పనులను ఆపాలని డిమాండ్ చేశారు.. ఆర్డీఎస్ పై అవగాహన లేని బచ్చాగాళ్లు ముఖ్యమంత్రి రాసిచ్చిన కాగితాలు చూసి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయిన ఆమె.. ఆంధ్రవాళ్లు అని విమర్శించే వారు రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నది మీ ముఖ్యమంత్రి కాదా? అని ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరులో ప్రాజెక్టుల సాధన.. నా కృషి వల్లే అనేది ముందు తెలుసుకోవాని సూచించిన డీకే అరుణ.. నేను పాలమూరు కోసం చేసిన కృషి మీకేం తెలుసు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, ఏడేళ్లుగా జల దోపిడీని అడ్డుకోలేని వారు.. ఇవాళ కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికలు ఉన్నాయని మాత్రమే జల దోపిడీ గురించి మాట్లాడుతున్నారని.. కేవలం ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు డీకే అరుణ. పాలమూరు, నీళ్ల పేరు చెప్పుకుని ఉద్యమాన్ని నడిపించి పాలమూరు ప్రజలను మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అంటూ మండిపడ్డ ఆమె.. పాలమూరు జిల్లా కోసం మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు.. కృష్ణ జలాలు పెద్ద ఎత్తున వృథా అవుతున్నా దాని గురించి మాట్లాడరు.. గత ప్రభుత్వాల మీద నిందలు వేస్తూ ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తూ పరిపాలన సాగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ డ్రామాలు ఆపి ముందు ఆంధ్రప్రదేశ్ కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఆపండి అంటూ డిమాండ్ చేశారు డీకే అరుణ.