కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి తామంతా ఢిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర ఆర్థిక మంత్రిని పలుమార్లు కలిసి విన్నవించినప్పటికీ, ఒక్క విన్నపాన్ని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. “తెలంగాణ ఏం తప్పు చేసింది?” అని ప్రశ్నిస్తూ, కేంద్రం వివక్షాపూరిత వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు.
రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన రీజినల్ రింగ్ రోడ్ (RRR), మెట్రో విస్తరణ, , మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుల కోసం కేంద్రం నుండి భారీగా నిధులు అందుతాయని ఆశించామని భట్టి పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవం కోసం కేంద్ర సాయం కోరినప్పటికీ బడ్జెట్లో దాని ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రపంచానికే ఫార్మా హబ్గా ఉన్నప్పటికీ, కేంద్రం ప్రకటించిన కెమికల్ పార్కుల జాబితాలో తెలంగాణకు చోటు కల్పించకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ECIL వంటి దిగ్గజ సంస్థలను హైదరాబాద్కు తెచ్చామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఉన్నవాటిని కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందని, అయితే కేంద్రం స్పోర్ట్స్ విభాగంలోనూ రాష్ట్రానికి మొండిచేయి చూపిందని భట్టి విమర్శించారు. అఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ గురించి విజన్ డాక్యుమెంట్లో తెలంగాణ గురించి ప్రముఖంగా చెప్పినా, బడ్జెట్ కేటాయింపుల్లో అది ఎక్కడా కనిపించలేదన్నారు. హైదరాబాద్ సెంట్రిక్గా ఉండాల్సిన ‘ఆరెంజ్ ఎకానమీ’ని కూడా బాంబేకి తరలించడం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి పరాకాష్ట అని ఆయన పేర్కొన్నారు. రామప్ప వంటి ప్రపంచ వారసత్వ కట్టడాలు, కృష్ణా-గోదావరి నదుల తీరంలో అద్భుతమైన దేవాలయాలు, అటవీ సంపద ఉన్నా తెలంగాణ టూరిజాన్ని కేంద్రం పూర్తిగా విస్మరించిందని భట్టి ఆరోపించారు. రీజినల్ మెడికల్ హబ్ ప్రకటించినా అందులో తెలంగాణ పేరు లేదని, సెమీ కండక్టర్ల విషయంలో కేవలం ‘పరిశీలిస్తాం’ అన్న మాటే తప్ప స్పష్టమైన ప్రకటన లేదని మండిపడ్డారు.
కేంద్రం 2047 లక్ష్య సాధనలో తాము కూడా భాగస్వామ్యం కావాలని అనుకున్నామని, కానీ కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేయడం వల్ల అది సాధ్యం కాదని ఆయన అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని జాబితా నుండి తొలగించే ప్రయత్నం చేస్తూ, పేదల సంక్షేమానికి కేంద్రం తూట్లు పొడుస్తోందని విమర్శించారు. “రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. మేము బాధ్యతగా కేంద్రాన్ని కలుస్తూనే ఉంటాం, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తాం” అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Iran-US: ఇరాన్కు ఏదైనా జరిగితే.. ఆ తర్వాత సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ట్రంప్కు ఖమేనీ వార్నింగ్