Bandi Sanjay Released Chargesheet On TRS Rule: మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్ అంతా ఒక డ్రామా అని.. బీజేపీకి చెందిన నేతలని చెప్తున్న ఆ ముగ్గురు వ్యక్తులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. నిజానికి.. ఆ ముగ్గురు వ్యక్తులకు కేసీఆర్ కుటుంబంతోనే సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. ఆ ఫాంహౌస్ టీఆర్ఎస్దేనని, అక్కడున్నది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని, డబ్బులు ఇవ్వడానికి ఆ ఫాంహౌస్కి వెళ్లిన ముగ్గురికీ టీఆర్ఎస్తో లింక్లు ఉన్నాయని, ఫిర్యాదు చేసింది కూడా టీఆర్ఎస్ వాళ్లేనని అన్నారు. ఈ తతంగంలో పోలీస్ కమిషనర్ హస్తం కూడా ఉందని ఆరోపించారు. కేవలం మునుగోడు ఉప ఎన్నికల కోసం ఇదంతా అవసరమా? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై తాము హైకోర్టుని ఆశ్రయిస్తామని, సీబీఐ విచారణ కూడా జరగాల్సిందేనని డిమాండ్ చేశఆరు.
ఇదే సమయంలో టీఆర్ఎస్ పాలనపై బండి సంజయ్ చార్జ్షీట్ విడుదల చేశారు. ఎన్నికల్లో గెలవడానికి టీఆర్ఎస్ డ్రామాలాడుతోందని.. పోటీ చేసే అభ్యర్థి ఏం చేశారు? ఏం చేయబోతున్నారు? అనేది మాట్లాడాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మూర్ఖత్వంగా సాగిస్తున్న కేసీఆర్ పాలన అంతం చేసేందుకే రాజగోపాల్రెడ్డి రాజీనామా చేశారన్నారు. ఇప్పటివరకూ మునుగోడును అభివృద్ధి చేయలేదని, కనీసం అవసరాలు కూడా తీర్చలేదని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తే.. ఆయన్ను అసెంబ్లీ నుంచి బయటకు గెంటేశారన్నారు. కేసీఆర్ బీజేపీని, ప్రధాని మోడీని తిట్టడమే పని పెట్టుకున్నారన్నారు. మనుగోడు ప్రజల కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ తాము ముందుకు పోతున్నామని తెలిపారు. ఇది రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక అని.. మునుగోడు ప్రజలకు వాస్తవాలను వివరించేందుకే తాము ఈ చార్జ్షీట్ విడుదల చేశామని స్పష్టం చేశారు. కేసీఆర్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు.