టీఆర్ఎస్ వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర జరుగుతోందని, బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్కక్కయ్యారని, భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు గులాబీ దండు స్కెచ్ అని, రైతులు అనివార్యంగా తక్కువ ధరకే వడ్లు విక్రయించేలా ప్లాన్, అన్నదాతాలారా…. కేసీఆర్ కుట్రలను చేదిధ్దాం రండి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా కేసీఆర్ మెడలు వంచుదాం రండి.. అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రైతులకు బహిరంగ లేఖ రాశారు. యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు మూసివేయడం వెనుక మహా కుట్ర దాగి ఉందని, పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో పనిలేకుండా తక్కువ ధరకే బ్రోకర్లకు (దళారులకు) అమ్ముకునేలా రైతులకు అనివార్య పరిస్థితులు సృష్టించి పెద్ద ఎత్తున లబ్ది పొందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పథకం రచించారని ఆయన ఆరోపించారు.
బ్రోకర్ల మాఫియాతో కలిసి పెద్ద స్కెచ్ వేశారని, దీనివెనుక వందల కోట్ల రూపాయలు కమీషన్ల పేరిట ప్రభుత్వ పెద్దలకు ముట్టబోతున్నాయని, యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం అందులో భాగమేనని, అయితే రైతులు పంట ఎందుకు కొనడం లేదని నిలదీసే అవకాశం ఉన్నందున… ఆ నెపాన్ని కేంద్రంపై రుద్ది బద్నాం చేయడమే లక్ష్యంగా వడ్ల కొనుగోలు పేరిట డ్రామాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వడ్ల పేరుతో మరోసారి ‘తెలంగాణ సెంటిమెంట్’ ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న డ్రామాలను తెలంగాణ రైతాంగం గమనించాలన్నారు.
మంచి చేస్తాడని ఓట్లేస్తే… లేని సమస్యను సృష్టించి రాజకీయాలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీ నేతలకు తగిన బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రైతు సోదరులారా…. న్యాయ నిర్ణేతలు మీరే….ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ మెడలు వంచేందుకు బీజేపీ చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నానని ఆయన లేఖను విడుదల చేశారు.