కొన్ని రోజుల నుంచి తెలంగాణ సర్కార్పై విజృంభిస్తోన్న బండి సంజయ్ కుమార్.. ఇప్పుడు సర్పంచ్లతో కలిసి సమరభేరీకి సిద్ధమవుతున్నారు. జూన్ తొలి వారంలో వారితో కలిసి మౌన దీక్షకు శ్రీకారం చుడుతున్నారు. హైదరాబాద్ లంగర్హౌజ్లోని బాపూఘాట్ వేదికగా సర్పంచ్లతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి రెండు గంటల పాటు మౌన దీక్ష చేపట్టనున్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా, ఇంకా ఆలస్యం చేస్తుండడంతో.. బిల్లులు ఇచ్చేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన ఈ దీక్షకు పూనుకున్నారు. అదేరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఈ అంశంపై నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు బండి సంజయ్ కార్యాచరణ రూపొందిస్తున్నారు.
‘పల్లె ప్రగతి’ పేరుతో గత నాలుగు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పనులన్నీ సర్పంచులు చేసినా.. వాటికి సంబంధించిన బిల్లులు ఇంకా మంజూరు కాలేదు. దీంతో గ్రామ పంచాయతీలన్నీ దివాళా తీశాయి. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. బిల్లులు రాకపోవడంతో సర్పంచులంతా అప్పులపాలయ్యారు. ఈ అప్పుల్ని భరించలేక కొందరు ఆత్మహత్యలు చేసుకోలేక, మరికొందరు ఆస్తులు అమ్ముకొని బతుకుదెరువు కోసం కూలీలుగా మారారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సర్పంచులకు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్న బీజేపీ.. భారీఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. తొలుత దీక్ష ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే పెద్దఎత్తున కార్యాచరణకు సిద్ధం కావాలని ప్రణాళికలు చేపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ లక్షల కోట్ల నిధులు ఇస్తోందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ, ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒకవైపు పంచాయతీలకు నిధులిస్తున్నట్లు ఉత్తర్వులిస్తూనే.. మరోవైపు ఆ నిధులను ఫ్రీజ్ చేస్తూ సర్పంచులను మానసిక క్షోభకు గురిచేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.