AP CS Sameer Sharma Wrote Letter To Telangana CS Over Interstate transfer of employees: ఉద్యోగుల అంతరాష్ట్ర బదిలీలపై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్కు ఏపీ సీఎస్ సమీర్ శర్మ లేఖ రాశారు. తెలంగాణ నుంచి ఏపీకి, ఏపీ నుంచి తెలంగాణకు శాశ్వత ప్రతిపాదికన బదిలీ కావడానికి కొందరు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు 1808 మంది, తెలంగాణ నుంచి ఏపీకి 1369 మంది బదిలీ కావాలని కోరుకునే ఉద్యోగులున్నారని అన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అవ్వాలనుకునే ఉద్యోగులకు ఎన్ఓసీ ఇవ్డానికి ఏపీ నిర్ణయించిందని.. ఏపీ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్ఓసీ ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్ర విభజన అనేది ఊహించని సంఘటన అని.. ఈ విభజన ఉద్యోగుల పని, జీవిత సమతుల్యతను ప్రభావితం చేసిందని సమీర్ శర్మ తెలిపారు. వైద్యం, భార్యాభర్తల ఉద్యోగం, పిల్లల చదువులు, సొంతిల్లు వంటి అనేక కారణాల వల్ల.. నిర్దిష్ట రాష్ట్రంలో ఉండాలనుకునే చాలామంది ఉద్యోగులు అసంతృప్తి, నిస్పృహకు లోనవుతున్నారన్నారు. ఈ ఉద్యోగుల ఆందోళనలను మానవతా ధృక్పధంతో పరిష్కరించాలని ఏపీ నిర్ణయించిందన్నారు. ఈ ఉద్యోగులను అంతర్రాష్ట్ర బదిలీ ద్వారా మార్చుకోవాల్సిన అవసరం ఉందని.. ఈ విషయంలో వీలైనంత త్వరగా సమస్యని పరిష్కరించాల్సిన అవసరముందని సమీర్ శర్మ ఆ లేఖలో పేర్కొన్నారు. మరి, దీనికి తెలంగాణ సీఎస్ ఎలా బదులిస్తుందో చూడాలి.