నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. రెండు గంటల వ్యవధిలోనే మూడు చోట్ల రోడ్లపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్లారు. బృందావన్ టాకీస్, హైవే బ్రిడ్జి, సిద్దుల గుట్ట వద్ద గొలుసు దొంగతనాలు జరిగాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొత్తం నాలుగున్నర తులాల గొలుసులు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘటన జరిగినప్పుడు ఒంటరిగా వెళ్తుండటంతో బాధితులు రక్షించాలంటూ కేకలు వేసినా లాభం లేకుండాపోయింది. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాలో నమోదయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. వరుస చోరీలతో స్థానికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.