తెలుగునాట మేటినాయికగా రాణించిన జమున హిందీ చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు. తెలుగులో విజయాసంస్థ నిర్మించిన 'మిస్సమ్మ'లో సావిత్రి చెల్లెలుగా జమున నటించారు.
జమున పేరు వినగానే చాలామంది ఆ నాటి సినీ అభిమానులు యన్టీఆర్, ఏయన్నార్ వంటి హేమాహేమీలతో విభేదించినా, చిత్రసీమలో నిలదొక్కుకొని రాణించారు అంటూ చెబుతుంటారు. నిజానికి ఆ ఇద్దరు మహానటులతోనూ జమున ఎంతో సఖ్యంగానే ఉన్నారు.
మహానటుడు యన్.టి. రామారావు పేరు తలచుకోగానే అనితరసాధ్యంగా ఆయన పోషించిన శ్రీకృష్ణుని పాత్రనే ముందుగా తెలుగువారి మదిలో మెదలుతుంది. అదే తీరున జమున పేరు తలచుకోగానే ఆమె ధరించిన సత్యభామ పాత్ర జనానికి గుర్తు రాకుండా ఉండదు.
జమునకు తొలి చిత్ర అవకాశం చాలా చిత్రంగా లభించింది. ఆమె పక్కింటి బామ్మగారు ఒకామె తమ చుట్టాలబ్బాయి రాజమండ్రిలో ఉన్నాడని, అతను సినిమా తీస్తున్నాడని, నటిస్తావా అని జమునను అడిగింది.