రాష్ట్రంలోని 8 మున్సిపల్ కార్పొరేషన్ లకు కొత్తగా నియమించబడిన కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు మంత్రి నారాయణ.. నగరాల్లో పార్కులు, సెంట్రల్ డివైడర్లు, రోడ్ల గుంతలు పూడ్చడం, డ్రెయిన్లలో పూడిక తొలగింపుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు..
ఏపీ సర్కార్ మైనార్టీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది.. రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు టెట్ పరీక్ష కోసం మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ ప్రకటించారు.. ఈ సెంటర్ల ద్వారా.. రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్(బీసీ-సీ), సిక్కులు, బుద్ధులు, జైనులు తదితర మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన పర్యటనకు బయల్దేరి వెళ్లారు.. రేపు ఢిల్లీ వేదికగా జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు సీఎం.. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిపై ప్రస్తావించబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.. 16వ శాసన సభ మొదటి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. మొత్తం 27 గంటల 28 నిముషాల పాటు సభ కార్యక్రమాలు జరిగాయని వెల్లడించారు.. శాసన సభలో సభ్యులు 36 ప్రశ్నలు ప్రభుత్వానికి సంధించారని.. అందులో స్వల్ప వ్యవధి ప్రశ్న ఒకటిగా పేర్కొన్నారు..
శాసనమండలి లాబీలో మంత్రి నారా లోకేష్ను కలిశారు వైసీపీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానమ్.. ఇప్పటికే ఆమె మంత్రి ఫరూఖ్ తో సమావేశమై.. పలు కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఈ భేటీలో ఆమె.. పార్టీలో చేరడంపై క్లారిటీ వచ్చిందని.. త్వరలో తెలుగుదేశం పార్టీలో జాకియా ఖానమ్ చేరుతున్నారంటూ పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది.
అసెంబ్లీ లాబీలో మీడియా చిట్చాట్లో హాట్ కామెంట్లు చేశారు లోకేష్.. నా దగ్గర రెడ్ బుక్ ఉందని నేనే దాదాపు 90 బహిరంగ సభల్లో చెప్పాను అని గుర్తుచేశారు.. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో చేర్చి.. చట్టప్రకారం శిక్షిస్తామని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నాను అని స్పష్టం చేశారు.. ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ దాకా వెళ్లి గగ్గోలు పెడుతున్నాడు అంటూ సెటైర్లు వేశారు మంత్రి.
ఇండియా కూటమిలో చేరతారా? అనే అంశంపై స్పందించిన వైఎస్ జగన్.. ఏపీలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీలో ఫొటో, వీడియో గ్యాలరీలు ఏర్పాటు చేశాం.. అవి చూసిన తర్వాత గళం విప్పాలని కోరాం.. ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు వచ్చాయి.. కానీ, కాంగ్రెస్ పార్టీ రాలేదు అనే విషయాన్ని గుర్తుచేశారు.