టీమిండియా ఆల్రౌండర్ శివం దూబే ఆదివారం నాడు రెండు గుడ్ న్యూస్లు అందుకున్నాడు. అతడు ఆదివారం తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ముంబై వాసి శివం దూబే గత ఏడాది గర్ల్ఫ్రెండ్ అంజుమ్ఖాన్ను వివాహం చేసుకున్నాడు. ఆదివారం అంజుమ్ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో శివం దూబే తన భార్య, కొడుకు ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. మరోవైపు ఐపీఎల్ మెగా వేలంలో శివం దూబేను రూ.4 కోట్లకు చెన్నై సూపర్కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది. ఇలా ఒకేరోజు రెండు శుభవార్తలు శివం దూబేను సంతోషపరిచాయి.
అయితే ప్రతి ఏడాది ఐపీఎల్లో శివం దూబే రేటు తగ్గుతూ వస్తుండటం గమనార్హం. 2019 సీజన్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు రూ.5 కోట్లకు దూబేను సొంతం చేసుకుంది. గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.4.40 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. తాజా వేలంలో రూ.4 కోట్లకే చెన్నై సూపర్ కింగ్స్ సొంతమయ్యాడు. టీమిండియా తరఫున శివం దూబే 13 టీ20లు, ఓ వన్డే మ్యాచ్ ఆడాడు. టీ 20 మ్యాచ్ల్లో 105 పరుగులు చేసిన అతడి యావరేజ్ స్కోర్ 17.50 పరుగులు. ఐపీఎల్లో 24 మ్యాచ్ల్లో 399 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 120.5గా నమోదైంది. ఇందులో 24 ఫోర్లు, 22 సిక్సర్లు ఉన్నాయి. బౌలింగ్లో 24 మ్యాచ్ల్లో నాలుగు వికెట్లు తీశాడు.