Honour Killing: తమిళనాడులోని విరుద్నగర్లో ‘పరువు హత్య’ చోటు చేసుకుంది. కార్తిక్ పాండీ(26) అనే వ్యక్తి, 8 నెలల క్రితం 22 ఏళ్ల నందిని పెళ్లి చేసుకున్నాడు. కుటుంబానికి ఇష్టం లేకుండా ప్రేమించిన వ్యక్తిని నందిని వివాహమాడింది. దీనిపై నందిని కుటుంబం కార్తిక్ పాండీపై ద్వేషం పెంచుకున్నారు. ప్రేమ వివాహం చేసుకుని తమ పరువు తీసిందని ఆమె కుటుంబం రగిలిపోయింది.
Read Also: Hijra Suicide: 8 ఏళ్ల మనవడి మృతిని జీర్ణించుకోలేక హిజ్రా ఆత్మహత్య..
ఈ క్రమంలోనే బుధవారం కార్తీక్ పాండి తన భార్య పని చేసే సూపర్మార్కెట్ నుంచి ఆమెను తీసుకువచ్చేందుకు వెళ్లిన సమయంలో, నందిని కుటుంబ సభ్యులు అతడిపై దాడి చేశారు. నందిని సోదరులు బాలమురుగన్, ధనబాల మురుగన్ కార్తిక్ పాండీని పదునైన ఆయుధాలతో దాడి పాల్పడ్డారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, కార్తీక్ పాండిని విరుదునగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ కేసు నిందితులపై కేసు నమోదైంది. పరారైన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. గతేడాది ఇదే విధంగా రాష్ట్రంలోని కృష్ణగిరి-ధర్మపురి జాతీయ రహదారిపై ఓ వ్యక్తిని అతని భార్య బంధువులు హత్య చేశారు. ఈ ఘటనలో మృతుడు జగన్ అనే వ్యక్తికి శరణ్య అనే మహిళతో యువతి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వివాహం జరిగింది. జగన్ను ఆయన భార్య బంధువులే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.