ICC Men’s T20 World Cupలో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆటగాళ్లకు ఇచ్చిన సూచనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మాటల యుద్ధం అవసరం లేదు..
బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియోలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సహచరులకు స్పష్టంగా చెప్పిన సందేశం కనిపించింది. పాకిస్థాన్ ఆటగాళ్లతో స్లెడ్జింగ్ చేయకుండా.. కేవలం తమ ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఓవర్ల మధ్య పరిగెత్తుతూనే ఉండండి.. ఎవరితోనూ ఏమీ అనకండి.. మనం మంచి క్రికెట్ ఆడాలి.. మన నైపుణ్యాల ఆధారంగా ఈ మ్యాచ్ గెలుస్తాం.. అని సూర్య చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
అయితే, టోర్నమెంట్కు ముందు పలు వివాదాలు చెలరేగినప్పటికీ, మైదానంలో మాత్రం ఎలాంటి మాటల వాగ్వాదాలు జరగలేదు. భారత్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. ఇక, ఓపెనర్ ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్కు బలమైన పునాది వేశాడు. అతని దూకుడైన బ్యాటింగ్తో భారత్ 175 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అయితే, పాకిస్థాన్ ఇన్నింగ్స్ మాత్రం ప్రారంభం నుంచే ఒత్తిడిలో పడింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో మ్యాచ్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు..
భారత బౌలర్లు పాక్ బ్యాటింగ్ను తొలి ఓవర్ నుంచే కట్టడి చేశారు.. భారల బౌలర్లలో బుమ్రా, హార్ధిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీసి.. కీలక భూమిక పోషించారు.. చివరకు పాకిస్థాన్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్థాన్పై భారతదేశం ఆధిక్యం 8-1కి చేరింది. అంతేకాకుండా, భారత్ సూపర్ 8 దశకు అర్హత సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శించిన నాయకత్వం, ఆటగాళ్ల క్రమశిక్షణ, మరియు మైదానంలో చూపిన క్రీడాస్ఫూర్తి ఇప్పుడు అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాయి.
The Unfolding
Raw. Real. Colombo.#TeamIndia 🇮🇳 | #T20WorldCup | #MenInBlue https://t.co/W7hftULm21
— BCCI (@BCCI) February 16, 2026