Pak Boycott India Match: భారత్తో జరగాల్సిన టీ20 వరల్డ్కప్ మ్యాచ్ను బహిష్కరించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ డిసిషన్ తీవ్ర పరిణామాలకు దారి తీసేలా కనిపిస్తోంది. ఈ నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పాకిస్తాన్పై కఠిన ఆంక్షల విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. అత్యంత తీవ్ర చర్యగా, పాకిస్తాన్ను రాబోయే టీ20 వరల్డ్కప్ నుంచే పూర్తిగా నిషేధించే అవకాశం ఉందని ఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Read Also: Dhurandhar 2 – Toxic : ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్.. సౌత్ ఆడియెన్స్ ఓటు ఎవరికో?
అయితే, ఫిబ్రవరి 15వ తేదీన కొలంబోలో భారత్తో జరగాల్సిన గ్రూప్ లీగ్ మ్యాచ్ను ఆడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నిర్ణయించింది. బంగ్లాదేశ్ను టీ20 వరల్డ్కప్ నుంచి తప్పించడానికి సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీసీబీ వెల్లడించింది. అయితే, తటస్థ వేదికపై మ్యాచ్లు ఆడేందుకు పీసీబీ ఇప్పటికే ఐసీసీ, బీసీసీఐలతో బైండింగ్ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం ఒప్పంద ఉల్లంఘనగా ఐసీసీ భావిస్తోంది. కాగా, ఈ అంశంపై డిసిషన్ తీసుకునేందుకు ఐసీసీ బోర్డు ఈరోజు ( ఫిబ్రవరి 2న) వర్చువల్ సమావేశం కానుంది. పాకిస్తాన్ను టోర్నీలో కొనసాగించాలా లేదా నిషేధించాలా అనే కీలక అంశంపై ఈ భేటీలో చర్చ జరగనుంది. ఒకవేళ టోర్నీలో ఆడేందుకు అనుమతించినా, పాకిస్తాన్కు కఠినమైన ఆంక్షలు తప్పవని ఐసీసీ వర్గాలు స్పష్టం చేశాయి.
Read Also: Shashwat Sachdev : ‘ధురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్ ఎంట్రీ.. హింట్ ఇచ్చిన స్టార్ హీరో
ఇక, పాకిస్తాన్పై విధించే ఆంక్షల్లో ప్రధానంగా టీ20 వరల్డ్కప్ నుంచి పూర్తిగా నిషేధించడం లేదా ఐసీసీ నుంచి వచ్చే వార్షిక ఆదాయ వాటాను నిలిపివేయడం ఉన్నాయి. అలాగే, భారత్- పాకిస్తాన్ మ్యాచ్ రద్దుతో ఐసీసీ హోస్ట్ బ్రాడ్కాస్టర్ జియో- స్టార్కు కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. ఈ నష్టాన్ని పీసీబీ పరిహారం రూపంలో చెల్లించాల్సి రావొచ్చని తెలుస్తోంది. సాధారణంగా భారత్- పాకిస్తాన్ టీ20 మ్యాచ్కు 10 సెకన్ల ప్రకటనకు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు రేటు ఉండటంతో.. మొత్తం నష్టం రూ.200 కోట్లకు మించవచ్చని అంచనా.
Read Also: Under-19 World Cup: సెమీఫైనల్లోకి భారత్.. ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్
అలాగే, పాక్ తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడేందుకు ఇతర క్రికెట్ దేశాలు నిరాకరించే అవకాశం కూడా ఉంది. ఒకవేళ సిరీస్లు జరిగినా, వాటి ఫలితాలు ఐసీసీ ర్యాంకింగ్స్ లేదా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) పాయింట్లలో లెక్కించకపోవచ్చని సమాచారం. దీంతో పాటు పాకిస్తాన్కు ప్రధాన ఆదాయ వనరైన పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)పై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఎక్కువగా ఉంది. రిటైర్డ్ ఆటగాళ్లు లేదా ఫ్రీ ఏజెంట్లు తప్ప, ప్రస్తుత అంతర్జాతీయ విదేశీ ఆటగాళ్లను పీఎస్ఎల్లో పాల్గొనకుండా నిషేధించే ఛాన్స్ ఉందని ఐసీసీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇది పీసీబీకి ఆర్థికంగా పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఒకవేళ పాకిస్తాన్ను టీ20 వరల్డ్కప్ నుంచి నిషేధిస్తే, వారి స్థానంలో ఉగాండా జట్టును టోర్నమెంట్ లోకి తీసుకోవాలనే అంశంపై కూడా ఐసీసీ బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ఐసీసీ సమావేశం అనంతరం పాకిస్తాన్ భవితవ్యం స్పష్టం కానుంది.