T20 World Cup: T20 ప్రపంచ కప్ వివాదాలు సమిసిపోతున్న సమయంలో బంగ్లాదేశ్ భారీ యూ-టర్న్ ఇచ్చింది. బంగ్లా తన రాజకీయాల కోసం తన జట్టును భారత్లో ఆడకుండా చేసింది. భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తమ జట్టును భారత్లో ఆడేందుకు అనుమతించలేదు. దీనికి బదులుగా తమ వేదికల్ని శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరాయి. అందుకు ఐసీసీ అంగీకరించకపోవడంతో టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత బంగ్లాకు మద్దతుగా పాకిస్తాన్ ఆడిన డ్రామా అందరికి తెలుసు. భారత్ మ్యాచ్ బాయ్కాట్ చేస్తామని ప్రగల్భాలు పలికి, చివరకు ఆడేందుకు సిద్ధమైంది. ఈ నెల 15న కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరుగబోతోంది.
Read Also: Diabetes: షుగర్ వ్యాధి తగ్గాలా, HBA1C నార్మల్ కావాలా?.. ఈ లైఫ్స్టైల్ పాటించండి..
ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తాన్ యూటర్న్ తర్వాత, ఇదే బాటలో బంగ్లాదేశ్ నడుచుకుంటోంది. బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ టీ20 ప్రపంచకప్ వివాదంపై స్పందించారు. 2026 T20 ప్రపంచ కప్లో పాల్గొనకూడదనే నిర్ణయం ప్రభుత్వంది కాదు, క్రికెటర్లు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తీసుకున్నారని నజ్రుల్ పేర్కొన్నారు. నజ్రుల్ వ్యాఖ్యలు చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. గతంలో తమ ఆటగాళ్లు భారత్ వెళ్లొద్దని ప్రభుత్వం నిర్ణయించిందని ఈయనే చెప్పడం గమనార్హం. ఇప్పుడు ఈ నెపాన్ని క్రికెటర్లు, బోర్డుపై నెట్టేసింది యూనస్ ప్రభుత్వం. ఈ మొత్తం వ్యవహారంలో ఆటగాళ్లకు ఎలాంటి సంబంధం లేదని, వాళ్లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నారని పలు మీడియా నివేదికలు చెప్పాయి.
