T20 World Cup match: టీ20 వరల్డ్ కప్ వివాదాలు ముగిశాయి. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈనెల 15న కొలంబో వేదికగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగబోతోంది. బంగ్లాదేశ్ భద్రతా కారణాలు చూపుతూ భారత్లో ఆడేందుకు నిరాకరించడం, బంగ్లాదేశ్ను ఐసీసీ టోర్నీ నుంచి తీసేసి, ఆ స్థానంలో స్కాట్లాండ్ ను తీసుకోవడం జరిగింది. దీనిని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిరసన వ్యక్తం చేసింది. దీంతో పాటు భారత్తో మ్యాచ్ ను బహిష్కరించింది.
అయితే, ఎట్టకేటకు చర్చోపచర్చల తర్వాత పాక్ భారత్తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఐసీసీ ఆంక్షలు, ఆర్థిక నష్టం భయాలు పాక్ యూ-టర్న్కు ఒక కారణం కాగా, మొత్తం వివాదంలో గేమ్ ఛేంజర్గా శ్రీలంక నిలిచింది. ఈ మ్యాచ్పై శ్రీలంక భారీ ఆశలు పెట్టుకుంది. ఒక వేళ ఈ మ్యాచ్ జరగకపోతే ఆ దేశం ఆర్థికం నష్టపోయేది. ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్కు భారీ క్రేజ్ ఉంటుంది. ఇటు భారత్, అటు పాక్ నుంచి భారీగా ప్రేక్షకులు తరలివస్తారు. శ్రీలంక ఆతిథ్య రంగం భారీగా క్యాష్ చేసుకుంటుంది.
Read Also: Operation Sindoor: భారత్ దాడి చేస్తుంటే, పాక్ సైన్యం నమాజ్ చేసింది..
ఈ నేపథ్యంలో మ్యాచ్ జరిగేలా శ్రీలంక చర్చలు నిర్వహించింది. సోమవారం రాత్రి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయక, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్య ఫోన్లో చర్చలు జరిగాయి. ఈ మ్యాచ్ జరిగేలా శ్రీలంక కృషి చేసింది. శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం (ఫిబ్రవరి 8) కొలంబో, ఇస్లామాబాద్లోని రెండు హైకమిషన్ల ద్వారా పాకిస్తాన్ అధికారులను సంప్రదించింది. ఇరు దేశాల దేశాధినేతల మద్య సుమారు 30 నిమిషాలు ఫోన్ సంభాషణ జరిగినట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ మంగళవారం ఉదయం తెలిపారు. ఇది క్రికెట్ దౌత్యం అని అన్నారు.
శ్రీలంక మాత్రమే కాకుండా బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీసీ) యూఏఈ క్రికెట్ బోర్డులు కూడా మ్యాచ్ ఆడేలా పాక్పై ఒత్తిడి తెచ్చాయి. దీంతో సోమవారం భారత్తో మ్యాచ్ ఆడుతామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. శ్రీలంక అధ్యక్షుడు దిస్సనాయకే మ్యాచ్ జరగడంపై సంతోషం వ్యక్తం చేశారు.