పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆర్థిక పరిస్థితిపై మాజీ ఛైర్మన్, మాజీ క్రికెటర్ రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది? అని పరోక్షంగా చెప్పారు. రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రమీజ్ రాజా.. పీసీబీ ఆదాయంలో సగానికి పైగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి వస్తుందని అంగీకరించారు.
ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. ఐసీసీకి వచ్చే మొత్తంలో సుమారు 90 శాతం డబ్బు బీసీసీఐ భారత్ క్రికెట్ బోర్డు (బీసీసీఐ) నుంచే వస్తుందని రమీజ్ రాజా వెల్లడించారు. ఐసీసీ ఆదాయంలో భారత్ పాత్ర అత్యంత కీలకం అని చెప్పుకొచ్చారు. ‘ఒకవేళ ఐసీసీకి బీసీసీఐ నిధులు ఇవ్వడం ఆపేస్తే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కుప్పకూలే పరిస్థితి వస్తుంది’ అని రమీజ్ రాజా స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ క్రికెట్ ఆర్థికంగా ఎంతగా ఇతరులపై ఆధారపడిందో ఇట్టే అర్ధమవుతోంది. ముఖ్యంగా భారత్తో రాజకీయంగా గొడవలు పెట్టుకుంటూనే.. క్రికెట్ పరంగా మాత్రం భారత డబ్బులపై ఆధారపడటం ఇప్పుడు నెట్టింట చర్చనీయంశంగా మారింది.
రమీజ్ రాజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ‘పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ చేస్తుంది కానీ.. బతుకేది మాత్రం ఇండియా డబ్బులపైనే’ అంటూ నెటిజన్లు పీసీబీపై సెటైర్లు విసురుతున్నారు. క్రికెట్లో రాజకీయాలు పక్కన పెట్టి.. ఆటపై దృష్టి పెట్టాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తున్నామని పాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పాక్ అన్ని విధాలుగా నష్టపోనుంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ మాజీలు కూడా పీసీబీపై మండిపడుతున్నారు.