Smriti Mandhana Interview: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో నెదర్లాండ్స్పై భారత మహిళల జట్టు 95 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. బుధవారం హెడింగ్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 47 బంతుల్లో 74 పరుగులు చేసి భారత భారీ స్కోరుకు బలమైన పునాది వేసింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన స్మృతి.. లీడ్స్ మైదానం బ్యాటింగ్కు ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పింది. వరుసగా రెండో అర్ధశతకం నమోదు చేసినప్పటికీ తన ఆటపై ఇంకా పూర్తి సంతృప్తి లేదని, తాను ఇంకా మెరుగుపడాల్సి ఉందని పేర్కొంది.
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైన స్మృతి మంధాన మట్లాడుతూ… ‘నేను లీడ్స్ మైదానంలో గతంలో ది హండ్రెడ్ టోర్నీలో కొన్ని మ్యాచ్లు ఆడాను. ఈ వికెట్ ఎప్పుడూ బ్యాటింగ్కు బాగా సహకరిస్తుంది. అవుట్ ఫీల్డ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. ఈరోజు నెదర్లాండ్స్ జట్టు కూడా బాగా ఆడింది’ అని పేర్కొంది. టీ20 ప్రపంచకప్లో తొలిసారి ఎదురైన నెదర్లాండ్స్ జట్టుపై ప్రత్యేకంగా ఎలా సిద్ధమయ్యారన్న ప్రశ్నకు స్మృతి ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ‘నెదర్లాండ్స్ జట్టు గురించి పెద్దగా అవగాహన లేదు. అందుకే వారి బౌలింగ్ విధానం, బలాబలాలపై అనేక వీడియోలు చూశాను. కానీ మేము ఎప్పుడూ ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయం. కొత్త జట్టైనా, టాప్ జట్టైనా ఒకే విధమైన గౌరవంతో బరిలోకి దిగుతాం. నెదర్లాండ్స్ ఫీల్డింగ్ చాలా బాగుంది. వారు మాకు మంచి పోటీ ఇచ్చారు’ అని తెలిపింది.
తన వ్యక్తిగత ఫామ్ గురించి మాట్లాడిన స్మృతి మంధాన.. ‘నేను అనుకున్న స్థాయిలో ఆడలేదని అనిపిస్తోంది. నా ఆట ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఈరోజు షెఫాలీ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఆమె ఆటకు ఫిదా అయ్యా. మేమిద్దరం కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించాం. షెఫాలీ మళ్లీ పరుగుల బాట పట్టడం జట్టుకు ఎంతో కీలకం. మెగా టోర్నీలో ఆమె ఇలానే ఆడాలని కోరుకుంటున్నా. షెఫాలీ ఆడితే జట్టుకు మంచి ఆరంభం దక్కుతుంది. అలానే నాపై కూడా ఒత్తిడి తగ్గుతుంది’ అని చెప్పింది. అదేవిధంగా భారత బౌలర్ శ్రీ చరణి ప్రదర్శనను కూడా ప్రశంసించింది. ‘శ్రీ చరణి అసాధారణంగా బౌలింగ్ చేసింది. నా దృష్టిలో ప్రతిరోజూ సరైన ప్రణాళికతో కష్టపడటం, సరైన పనులు చేయడం ముఖ్యమైన విషయం. తర్వాత మ్యాచ్లో ఫలితం ఎలా వస్తుందో చూద్దాం’ అని పేర్కొంది. ఇప్పుడు భారత మహిళల జట్టు జూన్ 21న మాంచెస్టర్ వేదికగా దక్షిణాఫ్రికాతో కీలక పోరుకు సిద్ధమవుతోంది. నెదర్లాండ్స్పై సాధించిన ఈ భారీ విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది.

