Mitchell Starc Said India Dominating World Cricket: భారత జట్టుపై ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ క్రికెట్లో టీమిండియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందన్నాడు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్పై పూర్తి ఆధిపత్యం చూపింది ఆస్ట్రేలియా టీమ్ అని, అప్పట్లో ప్రత్యర్థి జట్లు ఆసీస్ను ఎదుర్కొనేందుకు భయపడేవని గుర్తు చేశాడు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయని, ఇప్పుడు ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్న జట్టు భారత్ అని స్టార్క్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో భారత్ సాధించిన విజయాలపై స్టార్క్ స్పదించాడు.
టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో మిచెల్ స్టార్క్ మాట్లాడుతూ… ‘భారత్ అద్భుతంగా ఆడుతోంది. గతంలో ఆస్ట్రేలియా జట్టును చూసి ప్రత్యర్థులు ఒత్తిడికి లోనయ్యేవారు. కానీ ఇప్పుడు టీమిండియాను చూసి మిగతా టీమ్స్ భయపడుతున్నాయి. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో భారత్ను ఎదుర్కోవడం చాలా జట్లకు పెద్ద సవాలుగా మారింది. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సమతుల్యతతో ఉంది. అంతేకాదు బెంచ్ స్ట్రెంగ్త్ కూడా ఉండటం వల్లే ఈ స్థాయి ఆధిపత్యం సాధ్యమైంది’ అని అభిప్రాయపడ్డాడు.
Also Read: IND vs PAK: వరల్డ్కప్ మ్యాచ్లలో హైయెస్ట్ స్కోర్.. పాకిస్థాన్ బ్యాటర్ల హవా, కోహ్లీ మాత్రం..!
ప్రస్తుతం భారత జట్టు యువ ఆటగాళ్లతో పాటు సీనియర్లతో బలంగా ఉంది. కీలక మ్యాచ్లలో ఒత్తిడిని తట్టుకుని విజయాలు సాధించే సామర్థ్యం పెరగడం కూడా జట్టు విజయ రహస్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మద్దతు, బలమైన దేశీయ క్రికెట్ వ్యవస్థ కూడా టీమిండియా ఎదుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. ఒకప్పుడు ప్రపంచాన్ని భయపెట్టిన ఆస్ట్రేలియా స్థానాన్ని ఇప్పుడు భారత్ ఆక్రమించిందని మిచెల్ స్టార్క్ వ్యాఖ్యలు చేయడం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఇవి భారత జట్టు ప్రస్తుత ఫామ్, స్థిరత్వానికి నిదర్శనంగా భావిస్తున్నారు.