GT vs RR: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. ముల్లన్పూర్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ విధ్వంసకర శతకంతో చెలరేగగా, సాయి సుదర్శన్ కీలక అర్ధశతకంతో మెరిశాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ మే 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది.. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన 96 పరుగులతో జట్టుకు శుభారంభం అందించాడు. డోనోవన్ ఫెరీరా 38 పరుగులు, రవీంద్ర జడేజా 45 పరుగులతో రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ బౌలర్లలో జాసన్ హోల్డర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ జోడీ అద్భుత ఆరంభాన్ని అందించింది. తొలి వికెట్కు 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఈ జోడీ మ్యాచ్ను పూర్తిగా గుజరాత్ వైపు తిప్పింది. సుదర్శన్ 32 బంతుల్లో 58 పరుగులు చేయగా, గిల్ 53 బంతుల్లో 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు బాదిన గిల్ ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. గుజరాత్ కేవలం 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది.
ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్లో సెంచరీ సాధించిన తొలి కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో ఐదు సెంచరీలతో ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ తొమ్మిది సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా, జోస్ బట్లర్ ఏడు సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.ఇక సాయి సుదర్శన్ కూడా ఈ సీజన్లో తన అద్భుత ఫామ్ను కొనసాగించాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో తొమ్మిది సార్లు 50కి పైగా పరుగులు చేసిన బ్యాట్స్మన్గా నిలిచాడు. వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో 700కు పైగా పరుగులు చేసిన మూడో బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ ఘనతను క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ మాత్రమే సాధించారు.
అలాగే శుభ్మన్ గిల్-సాయి సుదర్శన్ జోడీ పురుషుల టీ20 క్రికెట్లో అత్యధిక శతక భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీగా కొత్త చరిత్ర రాసింది. 11 శతక భాగస్వామ్యాలతో వారు విరాట్ కోహ్లీ-క్రిస్ గేల్, బాబర్ ఆజమ్-మహ్మద్ రిజ్వాన్ వంటి దిగ్గజ జోడీల రికార్డులను అధిగమించారు. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన 96 పరుగులు చేసినప్పటికీ, రాజస్థాన్ బౌలర్ల వైఫల్యం జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ విభాగం మరోసారి తమ బలాన్ని నిరూపిస్తూ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఐపీఎల్ 2026 టైటిల్ కోసం గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.
