Kumar Sangakkara React on Sanju Samson’s Controversial Dismissal: సంజూ శాంసన్ ఔట్ అవ్వడం వలనే తాము మ్యాచ్ ఓడిపోయామని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ డైరెక్టర్ కుమార సంగక్కర అన్నాడు. మ్యాచ్ చాలా కీలక దశలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం రావడం తమను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. ఏదేమైనా క్రికెట్ ఆటలో అంపైర్ తీసుకున్న నిర్ణయానికే కట్టుబడాల్సి ఉంటుందని సంగక్కర పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సంజూ వివాదాస్పద తీరుతో ఔట్ అయిన విషయం తెలిసిందే. సంజూ ఇచ్చిన క్యాచ్ను షాయ్ హోప్ అద్భుతంగా పట్టినా.. అతడు బౌండరీ లైన్ను తాకినట్లు రీప్లేలో కనిపించింది.
సంజూ శాంసన్ ఔట్పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. థర్డ్ అంపైర్ నిశితంగా పరిశీలించి ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ కుమార సంగక్కర స్పందించాడు. ‘క్యాచ్ పట్టిన విధానంపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. రిప్లేల్లో చూసిన కోణాలను బట్టి అభిప్రాయం మారుతూ ఉంటుంది. వీడియోను చూస్తుంటే.. షాయ్ హోప్ బౌండరీ లైన్ను తాకినట్లే అనిపిస్తుంది. ఇలాంటి వాటిపై థర్డ్ అంపైర్కు కూడా నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమే. మ్యాచ్ కీలక దశలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం రావడం మమ్మల్ని నిరాశకు గురి చేసింది’ అని సంగా అన్నాడు.
Also Read: Sanju Samson: సంజూ శాంసన్కు అన్యాయం జరిగింది: భారత మాజీ ఓపెనర్
‘ఆటలో అంపైర్ లేదా థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయానికే కట్టుబడాల్సి ఉంటుంది. సంజూ శాంసన్ ఔట్పై మా అభిప్రాయం విభిన్నంగా ఉంది. అంపైర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటాం. ఈ మ్యాచ్ను తప్పకుండా గెలిచేవాళ్లం. సంజూ ఔట్తోనే మ్యాచ్ ఓడిపోయాం. ఢిల్లీ ప్లేయర్స్ అద్భుతంగా ఆడారు. చివరి వరకూ పోరాడి విజయం సాధించారు. నాణ్యమైన బౌలింగ్తో కట్టడి చేశారు. ఈ సీజన్లో సంజూ బాగా ఆడుతున్నాడు. జట్టులో అతడి పాత్రపై స్పష్టమైన అవగాహనతో ఉన్నాడు. సోషల్ మీడియాకు సంజూ దూరంగా ఉంటాడు. వ్యక్తిగతంగా చాలా ప్రైవసీని కోరుకుంటాడు’ అని కుమార సంగక్కర తెలిపాడు.