Rohit Sharma Retirement: భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్కు త్వరలోనే వీడ్కోలు పలికే అవకాశం ఉందనే వార్తలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లండ్తో జూలై 19న లార్డ్స్లో జరగనున్న మూడో వన్డే రోహిత్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావొచ్చని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని భారత సెలక్షన్ కమిటీ భవిష్యత్ జట్టును సిద్ధం చేసే దిశగా అడుగులు వేస్తోందని సమాచారం.
సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం జట్టుతో కలిసి ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నారు. యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో సెలెక్టర్లు ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇటీవల అద్భుతమైన ఫామ్లో ఉండటంతో అతడిని వన్డే జట్టులో దీర్ఘకాలిక ఓపెనర్గా తీర్చిదిద్దాలనే ప్రణాళిక ఉన్నట్లు సమాచారం.
ఇటీవల జరిగిన మూడు ఇన్నింగ్స్లలో రెండు సెంచరీలు బాదిన జైస్వాల్పై సెలెక్టర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రపంచకప్కు ముందు భారత్కు దాదాపు 20 వన్డేలు మాత్రమే ఉండటంతో ఆ మ్యాచ్లన్నింటిలోనూ జైస్వాల్కు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే రోహిత్ శర్మను రిటైర్మెంట్ ప్రకటించమని ఎవరూ ఒత్తిడి చేయరని, కానీ తన భవిష్యత్తుపై నిర్ణయం మాత్రం ఆయనే తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు రోహిత్ శర్మ ఇటీవలి వన్డే ప్రదర్శనలు కూడా ఆశించిన స్థాయిలో లేవు. గత ఎనిమిది వన్డే ఇన్నింగ్స్లలో ఆయన 241 పరుగులు మాత్రమే చేశారు. సగటు 30.1గా ఉండగా, ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేశారు. ఈ గణాంకాలు కూడా సెలెక్టర్ల ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అద్భుతమైన ఫామ్, అత్యుత్తమ ఫిట్నెస్ కారణంగా కోహ్లీకి జట్టులో స్థానం విషయంలో ఎలాంటి సందేహాలు లేవని తెలుస్తోంది. ప్రధాన కోచ్తో పాటు సెలక్షన్ కమిటీ కూడా కోహ్లీని ప్రపంచకప్ ప్రణాళికల్లో కీలక ఆటగాడిగా పరిగణిస్తున్నట్లు సమాచారం.
రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన సమయంలో కూడా సెలక్షన్ కమిటీతో ఆయన భవిష్యత్తుపై చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాను ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాలనే ఉద్దేశంతో లేనని, మొత్తం సిరీస్కు అందుబాటులోనే ఉన్నానని రోహిత్కు సన్నిహిత వర్గాలు అప్పట్లో స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఈ అంశంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. అయినప్పటికీ లార్డ్స్లో జరిగే మూడో వన్డేపై అందరి దృష్టి నిలిచింది. ఒకవేళ ఇదే రోహిత్ శర్మకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయితే, భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో ఒకరిగా ఆయన కెరీర్కు అభిమానులు భావోద్వేగ వీడ్కోలు పలికే అవకాశం ఉంది.

