క్రికెట్ చరిత్రలో కొన్ని టీమ్స్ మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన పోరాటాలు ఉంటాయి. భారత్-పాకిస్థాన్, ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఈ జాబితాలో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ చరిత్రను చూస్తే.. సఫారీ జట్టుపై భారత్ పైచేయి సాధిస్తూ వస్తోంది. ఇప్పటివరకు జరిగిన 7 ప్రపంచకప్ ముఖాముఖి పోరాటాలలో భారత్ 5 మ్యాచ్లలో విజయం సాధించగా.. దక్షిణాఫ్రికా కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. టీ20 ప్రపంచకప్లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్ల ఫలితాలు ఇలా ఉన్నాయి.
2007 (డర్బన్): తొలి టీ20 ప్రపంచకప్లోనే భారత్ 37 పరుగుల తేడాతో విజయం సాధించి ఘనమైన శుభారంభం చేసింది.
2009 (నాటింగ్హామ్): ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 12 పరుగుల తేడాతో గెలిచి భారత్పై పట్టును చాటింది.
2010 (సెయింట్ లూసియా): సురేష్ రైనా సెంచరీతో భారత్ 14 పరుగుల తేడాతో సఫారీలను ఓడించింది.
2012 (కొలంబో): చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో భారత్ కేవలం 1 పరుగు తేడాతో విజయం సాధించింది.
2014 (ఢాకా – సెమీఫైనల్): విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్తో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది.
2022 (పెర్త్): పదేళ్ల తర్వాత ప్రపంచకప్లో భారత్పై సఫారీలు 5 వికెట్ల తేడాతో విజయం నమోదు చేశారు.
2024 (బార్బడోస్ – ఫైనల్): అందరికీ గుర్తుండిపోయే చారిత్రాత్మక ఫైనల్ ఇది. టీమిండియా 7 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచకప్ను ముద్దాడింది.
5-2తో ఇండియా డామినేషన్:
ఈ గణాంకాలను బట్టి చూస్తే.. ప్రపంచకప్ లాంటి పెద్ద వేదికలపై దక్షిణాఫ్రికాను ఎదుర్కోవడంలో భారత్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంది. ఇప్పుడు మరోసారి తలపడేందుకు రెండు టీమ్స్ సిద్ధమయ్యాయి. 2024 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని సఫారీలు చూస్తుంటే.. తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని సూర్య సేన భావిస్తోంది.