ఐపీఎల్లో మంగళవారం రాత్రి లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో తక్కువ స్కోరే చేసినా గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. 62 పరుగుల తేడాతో లక్నోపై ఘనవిజయం సాధించి ప్లే ఆఫ్స్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 63 నాటౌట్, మిల్లర్ 26, రాహుల్ తెవాటియా 22 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మోసిన్ ఖాన్, జాసన్ హోల్డర్ చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం 145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు బాధ్యతారాహిత్యమైన ఆటతో ఓటమిని కొని తెచ్చుకుంది. అనవసరంగా ఒత్తిడికి లోనై స్టంపౌట్లు, క్యాచౌట్లు, రనౌట్లు అయ్యారు. లక్నో జట్టులో 8 మంది ఆటగాళ్లు రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు. డికాక్ 11, అవేష్ ఖాన్ 12 పరుగులు చేశారు. 27 పరుగులు చేసి దీపక్ హుడా టాప్ స్కోరర్ అంటే లక్నో టీమ్ బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టాడు. షమీ, యష్ దయాళ్, సాయి కిషోర్ తలో వికెట్ సాధించారు. పాయింట్ల పట్టికలో లక్నో టీమ్ రెండో స్థానంలో కొనసాగుతోంది.