Formula E-Racing: దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో నిర్వహించనున్న ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్కు సర్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-రేసింగ్ లీగ్లో భాగంగా నవంబర్ 19, 20 తేదీల్లో స్ట్రీట్ సర్క్యూట్ రేస్ ప్రారంభ ఎడిషన్ నిర్వహించనున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఏర్పాటు చేసిన రేసింగ్ ట్రాక్పై ట్రయల్ రేసును నిర్వహిస్తారు. అయితే ఈ రేసింగ్ను చూసేందుకు ఆసక్తి ఉన్న క్రీడాభిమానుల కోసం టిక్కెట్లను నిర్వాహకులు విడుదల చేశారు. ఇందుకోసం సాధారణ పాస్లు, రెండు రోజుల వారాంతపు పాస్లుగా.. రెండు రకాల టికెట్లను అందుబాటులో ఉండనున్నాయి. సాధారణ పాస్ టిక్కెట్ ధర రూ.749 గా ఉండగా.. రెండు రోజుల వారాంతపు పాస్ ధర రూ. 1,249 గా నిర్వాహకులు నిర్ణయించారు.
Read Also: IPL 2023: ముంబై ఇండియన్స్ అభిమానులకు షాక్.. ఐపీఎల్కు వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ గుడ్బై
కాగా ఫార్ములా ఈ-రేసింగ్ లీగ్ మొత్తం నాలుగు రౌండ్లలో జరుగుతుంది. మొదటి, 4వ రౌండ్లు హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్లో జరుగుతాయి. రెండు, 3వ రౌండ్లు చెన్నైలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో జరుగుతాయి. ఈ లీగ్లో ఇద్దరు భారతీయ డ్రైవర్లు, ఇద్దరు అంతర్జాతీయ డ్రైవర్లు రేసింగ్తో కూడిన ఆరు సిటీ ఆధారిత జట్లు ఉంటాయి. ప్రతి జట్టులో ఒక మహిళా డ్రైవర్ ఉంటారు. హైదరాబాద్లో జరిగే ఈవెంట్ నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మేనేజింగ్ కమిటీ ఏర్పాటు చేయగా.. ఈ కమిటీలో సభ్యులుగా మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా, సీఈవో దిల్ బాగ్ గిల్, అధికారులు, బ్రాండ్ అంబాసిడర్లు, నిపుణులు ఉన్నారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా హైదరాబాద్ సీపీ, పోలీసు, ఆర్ అండ్ బీ, పురపాలక, విద్యుత్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఇప్పటికే రేస్కు సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి.