అంతర్జాతీయ టీ20 క్రికెట్ అంటేనే.. పవర్ హిట్టింగ్ బ్యాటింగ్కు ప్రతీక. పొట్టి ఫార్మాట్లో బౌలర్పై బ్యాటర్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుంటాడు. ఈ క్రమంలోనే తక్కువ బంతుల్లో అర్ధ శతకం చేస్తుంటారు. టీ20 క్రికెట్లో ఇప్పటికే చాలామంది ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ చేశారు. పలువురు భారత ప్లేయర్స్ అద్భుతమైన స్ట్రోక్ప్లేతో వేగవంతమైన అర్ధ శతకాలు సాధించి.. భారత క్రికెట్ చరిత్రలో తమ పేర్లు లిఖించుకున్నారు.
2007లో డర్బన్ వేదికగా ఇంగ్లండ్పై మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సాధించిన అర్ధశతకం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. కేవలం 12 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసి టీ20 అంతర్జాతీయాల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన ఫిఫ్టీగా రికార్డు నెలకొల్పాడు. తొలి టీ20 ప్రపంచకప్లో యువీ విధ్వంసకర బ్యాటింగ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. తాజాగా 2026లో గువాహటి వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా సంచలనం సృష్టించాడు. కేవలం 14 బంతుల్లో అర్ధశతకం సాధించి ఈ లిస్ట్లో రెండో స్థానంలో నిలిచాడు. యువ ఆటగాడిగా అభిషేక్ తన దూకుడైన బ్యాటింగ్తో అభిమానులను ఆకట్టుకున్నాడు.
Also Read: Most Runs In Over: ఓవర్లో అత్యధిక పరుగులు.. టీమిండియా బ్యాటర్ల ఫుల్ లిస్ట్ ఇదే!
తాజాగా విశాఖపట్నంలో శివమ్ దూబే మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్పై 15 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసి.. ఈ జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. మిడిల్ ఆర్డర్లో దూబే పవర్ హిట్టింగ్కు ఇది మరో నిదర్శనం. 2025లో అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు.ఫినిషర్గా హార్దిక్ తన సత్తాను మరోసారి చాటిచెప్పాడు. ఒత్తిడిలోనూ వేగంగా పరుగులు సాధించే అతని సామర్థ్యం ఈ ఇన్నింగ్స్లో స్పష్టంగా కనిపించింది. ఇక 2025లో వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ మరోసారి మెరిశాడు. 17 బంతుల్లో ఫిఫ్టీ సాధించి.. ఒకే ఏడాదిలో రెండుసార్లు ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. భారత బ్యాటర్లు అంతర్జాతీయ టీ20ల్లో వేగవంతమైన అర్ధ శతకాలతో ప్రపంచ క్రికెట్పై తమ ముద్ర వేశారు. ఈ రికార్డులు టీమిండియా దూకుడైన క్రికెట్కు అద్దం పడుతున్నాయి.