ఇంగ్లాండ్తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్లో 553 పరుగులకి ఆలౌటైంది. ఇటీవల లార్డ్స్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన న్యూజిలాండ్ టీమ్.. రెండో టెస్టులో గొప్ప పోరాట పటిమని కనబర్చింది. ఆ జట్టులో డార్లీ మిచెల్ (190: 318 బంతుల్లో 23×4, 4×6) భారీ శతకం నమోదు చేయగా.. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ (106: 198 బంతుల్లో 14×4) సెంచరీ నమోదు చేశాడు.
శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్లో తొలిరోజు ఓపెనర్ విల్ యంగ్ (47), కెప్టెన్ టామ్ లాథమ్ (26) నిరాశపరచగా.. దేవాన్ కాన్వె (46), హెన్రీ నికోలస్ (30) కూడా తక్కువ స్కోరుకే ఔటైపోయారు. దాంతో.. 169/4తో నిలిచిన న్యూజిలాండ్ టీమ్.. ఒత్తిడిలో కనిపించింది. కానీ.. ఐదో వికెట్కి టామ్, మిచెల్ జోడి ఏకంగా 236 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. న్యూజిలాండ్ టీమ్ని ఈరోజు తిరుగులేని స్థితిలో నిలిపింది.
శతకం తర్వాత టామ్ బ్లండెల్ ఔటైపోయినా.. చివరి వరకూ డార్లీ మిచెల్ క్రీజులో నిలిచాడు. అతనికి బ్రేస్వెల్ (49) కాసేపు సపోర్ట్ అందించగా.. ఆఖర్లో జెమీషన్ (14), టిమ్ సౌథీ (4), మాన్ హెన్రీ (0) వరుసగా పెవిలియన్కి చేరిపోయారు. కానీ.. ట్రెంట్ బౌల్ట్ (16 నాటౌట్: 18 బంతుల్లో 4×4) విలువైన పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ మూడు వికెట్లు పడగొట్టగా.. స్టువర్ట్ బ్రాడ్, బెన్స్టోక్స్, జాక్ లీచ్ తలో రెండు వికెట్లు, మాటీ పోట్స్ ఒక వికెట్ తీశాడు.