భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో గంభీర్ ఒప్పందం 2027 వన్డే వరల్డ్కప్ వరకు ఉంది. అప్పటిలోగా టీమిండియా ప్రదర్శన సంతృప్తికరంగా ఉంటే.. గౌతీ పదవీకాలాన్ని పొడిగించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. 2028 ఒలింపిక్స్ దాకా గంభీర్ సేవలను ఉపయోగించుకోవాలని బీసీసీఐ చూస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం గౌతమ్ గంభీర్ పూర్తి దృష్టి టీ20 ప్రపంచకప్ 2026పై ఉంది. ఇప్పటికే భారత్ సూపర్ 8 చేరుకుంది. టైటిల్ గెలవడమే గౌతీ లక్ష్యం. వన్డే ప్రపంచకప్ 2027లో కూడా భారత్ను విజయపథంలో నడిపించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ రెండు ఐసీసీ టోర్నీల ఫలితాలే గంభీర్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఒకవేళ రెండు మేజర్ టోర్నీలను భారత్ గెలిస్తే.. గంభీర్ పదవీకాలం తప్పక పొడగించబడుతుంది.
బీసీసీఐ వర్గాల అంచనాల ప్రకారం.. గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత జట్టు మంచి ఫలితాలు సాధిస్తే, దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఆయనను కొనసాగించాలని భావిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్కు పతకాలు సాధించే లక్ష్యంతో 2028 ఒలింపిక్స్ దాకా కోచింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి గంభీర్ భవిష్యత్తు ఆయన కోచింగ్లో టీమిండియా ప్రదర్శనపై ఆధారపడి ఉంది.