డిసెంబర్ 22న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. ఈ సమావేశంలో టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సెంట్రల్ కాంట్రాక్టులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రో-కోలను ‘A+’ కేటగిరీ నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి. టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి.. కేవలం వన్డే ఫార్మాట్ల్లోనే కొనసాగుతున్న కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనుంది. దేశీయ క్రికెట్లో మహిళా క్రీడాకారుల చెల్లింపుల విషయంపై కూడా ఏజీఎం సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇది 31వ వార్షిక సర్వసభ్య సమావేశం. మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరుగుతున్న మొదటి ఏజీఎం. టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను A+ గ్రేడ్ నుంచి తొలగించి.. A కేటగిరీలో ఉంచే అవకాశాలు ఉన్నాయి. రో-కోను A కేటగిరీలో ఉంచితే.. వారి వార్షిక వేతనంలో రూ.2 కోట్లు తగ్గుతుంది. ప్రస్తుతం వార్షిక వేతనాలు రూ.7 కోట్లు (A+), రూ.5 కోట్లు (A), రూ.3 కోట్లు (B), రూ.1 కోటి (C)గా ఉన్నాయి. భారత టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్మాన్ గిల్ను A+ కేటగిరీలో చేర్చే అవకాశాలు ఉన్నాయి. A+లో ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాలు ఉన్నారు.
Also Read: 108MP కెమెరా, 5520mAh బ్యాటరీ.. అతి తక్కువ ధరలో స్లిమ్ డిజైన్తో వస్తున్న Redmi Note 15!
ప్రస్తుతం A కేటగిరీలో మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. ఈఏడాది కాలంగా ఆడని షమీ కేటగిరీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ Bలో ఉన్నారు. రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలు C కేటగిరీలో ఉన్నారు. ఆన్లైన్లో జరగనున్న ఏజీఎంలో అంపైర్లు, రిఫరీల వేతనాలపై కూడా చర్చించనున్నారు.