టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుత ఫామ్పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ బ్యాట్తో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. అభిషేక్ సామర్థ్యంపై జట్టుకు ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశాడు. ప్రతి ఆటగాడికి ఎత్తుపల్లాలు సహజమని, అలాంటి దశను ఇప్పుడు అభిషేక్ ఎదుర్కొంటున్నాడని తెలిపాడు. ఎన్నో అంచనాల మధ్య టీ20 ప్రపంచకప్ 2026లో అడుగుపెట్టిన అభిషేక్.. వరుసగా మూడు డకౌట్స్ అయ్యాడు. దాంతో అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ మ్యాచ్ అనంతరం ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కెప్టెన్ సూర్య సమాధానం ఇచ్చాడు.
సూర్యకుమార్ కుమార్ మాట్లాడుతూ… ‘అభిషేక్ శర్మ ఎంత ప్రతిభావంతుడో అందరికీ తెలుసు. ప్రస్తుతం అతడు పరుగులు చేయకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదు. త్వరలోనే అభిషేక్ మళ్లీ పరుగుల వరద పారిస్తాడు. ఆ నమ్మకం మాకు ఉంది. క్రికెట్లో ఫామ్ కోల్పోవడం సహజమే. జట్టులో ప్రతి ఒక్కరికీ అభిషేక్పై పూర్తి విశ్వాసం ఉంది. కెప్టెన్గా నాకైతే మరింత నమ్మకం ఉంది. త్వరలోనే అభిషేక్ తన సహజ ఆటతో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడు’ అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలతో అభిషేక్పై టీమ్ మేనేజ్మెంట్కు బలమైన మద్దతు ఉన్నట్టు స్పష్టమైంది.
ప్రస్తుతం ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ అన్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ 2026లో మాత్రం వరుసగా విఫలమయ్యాడు. అమెరికా, పాకిస్థాన్, నెదర్లాండ్స్పై డకౌట్ అయ్యాడు. దాంతో టీ20 వరల్డ్ కప్లో భారత్ తరఫున అత్యధిక డకౌట్లు అయిన ఆటగాడిగా ఆశిష్ నెహ్రాతో కలిసి అభిషేక్ అగ్రస్థానంలో నిలిచాడు. ఓవరాల్గా ఐదు డకౌట్లతో షాహిద్ అఫ్రిది, తిలకరత్న దిల్షాన్ మొదటి స్థానంలో ఉన్నారు.