ఉండవల్లి అరుణ్ కుమార్. మాజీ ఎంపీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సడెన్గా హాట్ హాట్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత సైలెంట్గా ఉంటూ.. కీలక అంశాలపై అప్పుడప్పుడూ మీడియా ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో రాజకీయ వేడి కాక మీద ఉంది. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ అజెండాతో ముందుకెళ్లాలని చూస్తున్న సీఎం కేసీఆర్ BRS పేరుతో కొత్త నేషనల్ పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. అలాంటి కేసీఆర్తో ఉండవల్లి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉండవల్లి కరుడుగట్టిన సమైక్య వాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం గట్టిగా వాదించి సక్సెస్ అయ్యారు కేసీఆర్. అలాంటి ఇద్దరూ సమావేశం కావడం రాజకీయ మేధావుల బుర్రకు పెద్ద పనే పెట్టింది. ఇద్దరూ ఎందుకు భేటీ అయ్యారు? ఈ సమావేశం వెనక బలమైన కారణం ఉందా? రానున్న రోజుల్లో ఇద్దరూ కలిసి పనిచేస్తారా? ఇలా అనేక ప్రశ్నలు పొలిటికల్ సర్కిళ్లలో షికారు చేస్తున్నాయి.
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు ఉండవల్లి. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఉండవల్లి ఆపార్టీలో చేరతారు.. ఈ పార్టీలో చేరతారు అని చర్చ జరిగినా అవి చర్చగానే మిగిలిపోయాయి. కానీ.. జాతీయ పార్టీ కోసం కేసీఆర్ కసరత్తు చేస్తున్న తరుణంలో జరిగిన భేటీ కావడంతో గులాబీ బాస్తో ఉండవల్లి కలిసి రాజకీయ ప్రయాణం చేస్తారా అనే ప్రశ్న బలంగా చర్చల్లో ఉంది. ఇద్దరి మధ్య దేశ, రాష్ట్ర తాజా రాజకీయాలపై విస్తృతంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత వాతావరణంలో కొత్త పార్టీకి ఉన్న అవకాశాలపై లోతైన విశ్లేషణ చేసినట్టు చెబుతున్నారు.
జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ అజెండా కోసం సీఎం కేసీఆర్ చాలా కసరత్తు చేసినట్టుగా.. ఆయనతో భేటీ తర్వాత అర్థమైనట్టు తన సన్నిహితులతో ఉండవల్లి అన్నారట. అలాగే కొత్త రాజకీయ పార్టీపై తనకున్న ఆలోచనలను కేసీఆర్తో ఉండవల్లి పంచుకున్నట్టు సమాచారం. ఇప్పటికే వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులతో తెలంగాణ సీఎం భేటీ అవుతున్నారు. ఆ క్రమంలోనే ఉండవల్లితో సమావేశమైనట్టు మరో ప్రచారం ఉంది. అయితే రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం. కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీకి ఎవరెవరు కలిసి వస్తారో.. ప్రయాణం సాగిస్తారో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. అప్పుడే ఉండవల్లి పొలిటికల్ భవిష్యత్ కూడా క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారట.