తెలకపల్లి రవి: కృష్ణా జలాలపై పెరుగుతున్న వివాదం ఉభయరాష్ట్రాలకూ నష్టదాయకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణానదీ జలాల వినియోగంపై క్రమక్రమంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య వివాదం పెరుగుతున్నది. పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పేరిట రిజర్వాయరు సామర్థ్యం పెంచడం వల్ల శ్రీశైలం నీటిని తరలించుకుపోతారని తెలంగాణ ఆరోపణ. రాజోలిబండ డైవర్షన్ దగ్గర పనులకూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది.అయితే ఈ క్రమంలో తెలంగాణ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని దొంగ అని జగన్ గజదొంగ అని వ్యాఖ్యానించడం. తర్వాత ఏకంగా రాక్షసుడని తిట్టిపోయడం వేడిపెంచింది. ఇలా మాట్లాడటం సమంజసం కాదని ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి,మంత్రులు అనిల్కుమార్ తదితరులు స్పందించిన తర్వాత రాక్షసుడు కాదు మహారాక్షసుడుఅంటూ మరో తెలంగాణ మంత్రి శ్రీనివాసగౌడ్ స్వరం పెంచారు. ఎపి ముఖ్యమంత్రి జగన్తో కెసిఆర్ ప్రభుత్వం రాజీ పడుతున్నదని ఒకవైపు. జగన్ తెలంగాణ ముఖ్యమంత్రికి లొంగిపోయాడని మరోవైపు వివిధ ప్రతిపక్షాలు ఆరోపణలు మొదలుపెట్టాయి. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్రషెకావత్కు ఫిర్యాదు చేయగా తాము పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పర్యావరణ అనుమతులు లేవు గనక దాన్నినిలిపేయాలని కృష్ణా రివర్ వాటర్ మేనేజిమెంట్ బోర్డు(కెఆర్ఎంబి)లేఖ రాసింది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చాలా ప్రాజెక్టులకు ఎలాటి అనుమతులూ లేవని ఎపి ఫిర్యాదు చేసింది. ఈ రెండు అంశాలు కొద్ది కాలం కిందట ఉభయ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రి షెకావత్ సమక్షంలో జరిగిన ఎపెక్స్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినవే.అలాగే శ్రీశైలం వద్ద తగు నీటిమట్టం లేకున్నా విద్యుదుత్పత్తి చేయడం వల్ల తమ వాటా నీటికి నష్టం వాటిల్లుతున్నదని ఎపి చేసిన ఫిర్యాదుపైనా స్పందించి నిలిపేయాలని ఆదేశాలిచ్చింది. తాము పరిశీలనకు వస్తామంటే ఎపి ప్రభుత్వం సహకరించలేదని నోడల్ అధికారిని కేటాయించలేదని కెఆర్ఎంబి ఆరోపించింది. సిఐఎస్ఎప్ దళాల భద్రతతో పర్యటించి పరిశీలిస్తామని కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది. తెలంగాణ మంత్రివర్గం కెసిఆర్ అలంపూర్ వద్ద బ్యారేజీ నిర్మాణంతో సహా మరిన్నికొత్త ప్రాజెక్టులను చేపడతామని ఈ వివాదం తర్వాత కొత్తగా ప్రకటించింది,కరువుతో అల్లాడే కర్నూలు జిల్లా పడమట ప్రాంతానికి బ్రిజేష్ కుమార్ కేటాయించిన నాలుగు టిఎంసిల అదనపు జలాలపైన కూడా తెలంగాణ అభ్యంతరం చెప్పడం ఆ ప్రాంత వాసుల విమర్శకు గురైంది.
కరోనా కారణంగా తాము గతంలో కెఆర్ఎంబి పర్యటనకు అధికారిని ఇవ్వలేకపోయామని ఇప్పుడు ఏ సమయంలో కెఆర్ఎంబి అధికార బృందంవచ్చినా పర్యటనకు పూర్తి ఏర్పాట్లు చేస్తామని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.మరోవైపున పోలీసుల పహారాతో తెలంగాణ శ్రీశైలంలోనూ పులిచింతల దగ్గర జలవిద్యుత్ ఉత్పత్తిని కొనసాగించుతున్నది, ఇరు రాష్ట్రాలు కూడా తమ వంతు నీటిని చుక్క కూడా వదులుకోబోమంటూ అవతలివారిదే తప్పు అంటుండడంతో వివాదం ముదిరిపోతున్నది. బుధవారం జరిగిన ఎపి క్యాబినెట్ సమావేశంలో నీటి విషయమై వెనక్కు పోయేది లేదని మరోసారి ప్రకటించారు.వాస్తవానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కర్ణాటక మహారాష్ట్రాలకు అదనంగా నీటిని కేటాయించింది. ఎపి తెలంగాణల మధ్య వివాదాలతో కాలం గడిచిపోతే గతంలో బచావత్ కేటాయించిన నీటిని కూడా వినియోగించుకునే పరిస్థితి వుండదు. ఇరు రాష్ట్రాలకు కేటాయించిన నికర జలాలను వినియోగించుకుంటూ మిగులు జలాలలో హక్కును కాపాడుకునే విధంగా వ్యవహరించాలి తప్ప తగాదాలు రెచ్చగొట్టుకోవడాల వల్ల ప్రయోజనం వుండదు.మొదట ఎపిఎత్తిపోతల ప్రకటించడం గాని తర్వాత తెలంగాణమరిన్ని పథకాలను ప్రతిపాదించడం గాని వివాదంపెంచాయి తప్ప పరిష్కరించే అడుగులు కాదు.రెండు రాష్ట్రాలలో వెనకబడిన ప్రాంతాలకు నీటికి ప్రాధాన్యత నిస్తూ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడానికి కావలసినన్ని నీళ్లు కృష్ణా గోదావరి నదుల్లో వున్నాయి, ఈ విషయమై గతంలో కెసిఆర్జగన్ సమావేశంలో అంగీకారానికి వచ్చారు కూడా.కాంగ్రెస్ బిజెపి వంటిపార్టీలు షరామామూలుగా రెండు రాష్ట్రాల్లో రెండు రకాలుగా మాట్టాడటం సరికాదు.వివాదాలు ఉద్రిక్తతలు రాజకీయ ప్రయోజనానికి పనికి వస్తాయి తప్ప రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చవు. కాగా రామాయణంలో పిడకలవేటలా తెలంగాణలో కొత్త పార్టీ వైఎస్ఆర్టిపి నేత షర్మిల మాటలను మరీ తీవ్రంగా తీసుకోవడం లోటస్పాండ్లో ఆమె నివాసం దగ్గర ఘర్షణ పడటం మరింత అవాంచనీయం.తెలంగాణలో ఎపి ప్రజలున్నారు గనక ఆలోచించవలసి వస్తున్నదని ముఖ్యమంత్రి జగన్ క్యాబినెట్ సమావేశంలో అన్నట్టు చెబుతున్నారు. వాస్తవానికి విభజనతర్వాత ఇరురాష్ట్రాల ప్రజలు ప్రశాంతంగానూ సుహృద్భాంతోనూ వుంటున్నారు. విభజన సమస్యలు నీటి వివాదాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరుతున్నారు తప్ప ఘర్షణను వాంచించడం లేదు.
Also Read
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!