ఏపీలో రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గాల్లో రాజమండ్రి ఒకటి. ఇక్కడి రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా ఉండటమే దానికి కారణం. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు గడువు ఉన్నా.. ఇప్పటి నుంచి పావులు కదుపుతున్న నేతలు ఎక్కువే. ప్రస్తుతం రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన ఆదిరెడ్డి భవానీ ఉన్నారు. ఆమె దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు కుమార్తె. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలిలో రాజమండ్రి అర్బన్, రూరల్ ఓటర్లు టీడీపీకే పట్టం కట్టారు. అర్బన్లో భవాని నెగ్గితే.. రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు. దీంతో మూడేళ్లుగా ఇక్కడి రాజకీయాలు ఆసక్తిగా ఉంటున్నాయి. ఇంతలో అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చేసిన ప్రకటన సంచలనంగా మారింది.
వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ నుంచి తన భర్త శ్రీనివాసు పోటీ చేస్తారని చెప్పారు ఎమ్మెల్యే భవాని. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదన్నది ఆమె మాట. వాస్తవానికి 2019లోనూ చివరి నిమిషంలో తనను టీడీపీ అధిష్ఠానం పోటీ చేయిందనీ చెప్పుకొచ్చిన ఆమె.. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆదిరెడ్డి శ్రీనివాస్ తనకంటే భారీ మెజారిటీతో గెలుస్తారని వెల్లడించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వాసుయేనని చెప్పడంపై కేడర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోందట. అధిష్ఠానం నుంచి వచ్చిన సంకేతాల ఆధారంగా ప్రకటన చేశారా? లేక సొంత స్టేట్మెంటా అనేది చర్చగా మారింది.
వాస్తవానికి ఆదిరెడ్డి కుటుంబంలో శ్రీనివాస్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులంతా రాజకీయంగా పదవులు అనుభవించినవాళ్లే. వాసు తండ్రి అప్పారావు ఎమ్మెల్సీగా, తల్లి వీరరాఘవమ్మ రాజమండ్రి మేయర్గా పనిచేశారు. వాసు భార్య భవాని ఎమ్మెల్యే. 2019లో వాసునే టీడీపీ టికెట్పై పోటీ చేయాల్సి ఉంది. కానీ.. భవానీకి టికెట్ ఇచ్చింది పార్టీ. అందుకే వచ్చే ఎన్నికల్లో వాసును బరిలో దించి ఎమ్మెల్యేగా చేయాలని ఆదిరెడ్డి కుటుంబం గట్టిగా ప్రయత్నాలు చేస్తోందట.
రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈసారి అర్బన్ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఆయన ఇప్పటికే కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు. పైగా ఆదిరెడ్డి కుటుంబంతో ఆయనకు పడటం లేదు. రాజమండ్రి రూరల్ నుంచి రెండుసార్లు. రాజమండ్రి అర్బన్ నుంచి నాలుగుసార్లు గెలిచారు బుచ్చయ్య చౌదరి. సిటీని వదిలేసి తప్పు చేశానన్న ఫీలింగ్లో ఆయన ఉన్నారట. పైగా అర్బన్లో అనుచరగణం ఉండటంతో రాజమండ్రిపై గట్టి ఆశలే పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం గ్రహించే భవాని ముందుగానే ప్రకటన చేశారా? అనేది డౌట్.
ఆ మధ్య ఆదిరెడ్డి శ్రీనివాసు రాజమండ్రి లోక్సభకు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ.. ఆయన మాత్రం అసెంబ్లీకే బరిలో ఉంటానని అనుచరులకు చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో రాజమండ్రిలో పట్టు నిలుపుకొనేందుకు ఆదిరెడ్డి కుటుంబం చేయని ప్రయత్నం లేదు. ఆదిరెడ్డి, గోరంట్ల వర్గాల మధ్య నిత్యం గొడవలు కామనైపోయాయి. ఇలాంటి తరుణంలో టీడీపీ అధిష్ఠానం ఏం చేస్తున్నది ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తోంది.