శ్రీకాకుళం టీడీపీలో వర్గపోరుకు బీజం పడుతోందా? 2024 అసెంబ్లీ ఎన్నికల టైం ముంచి సైలెంట్ అయిపోయిన పొలిటికల్ ఫ్యామిలీ మళ్ళీ యాక్టివ్ అవుతోందా? ఈసారి సరికొత్తగా వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అదే నిజమైతే సిట్టింగ్ ఎమ్మెల్యే సంగతేంది? ఇద్దరి మధ్య సమన్వయం ఎలా కుదురుతుంది? అధిష్టానం ముందున్న ఆప్షన్స్ ఏంటి? అసలు ఎవరా రాజకీయ వారసుడు? ఇన్నాళ్ళు ఎక్కడున్నారు?
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం తర్వాత అడపాదడపా తప్ప… దాదాపు ప్రతి ఎన్నికలోనూ ఇక్కడ సత్తా చాటింది సైకిల్. మంచి కేడర్ బేస్తో గుండ ఫ్యామిలీకి గట్టి పట్టుంది. ఇటీవల చనిపోయిన మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ నాలుగు సార్లు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన భార్య లక్ష్మీదేవి కూడా 2014లో ఇక్కడి నుంచే శాసనసభకు వెళ్ళారు. 2024లో గుండ ఫ్యామిలీకి కాకుండా గొండు శంకర్కు టీడీపీ సిక్కోలు సీటు ఇవ్వడం, ఆయన గెలవడం వరుస పరిణామాలు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గ అధికార పార్టీలో పెద్దగా హడావిడి లేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవల అప్పల సూర్యనారాయణ చనిపోయాక రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా నుంచి వచ్చిన మాజీ మంత్రి కుమారులు సంతాప సభల్లో కీలక వాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ప్రజల అభీష్టం మేరకు తాము రాజకీయాల్లోకి వస్తామని, ఇక మీదట ఇక్కడి ప్రజలతోనే ఉంటామని చెప్పడం హాట్ టాపిక్ అయింది.
ప్రస్తుతం శ్రీకాకుళం పొలిటికల్ డిస్కషన్ మొత్తం దీని చుట్టూనే నడుస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే గొండు శంకర్ ఉన్నారు. తాజాగా రాజకీయ వారసుల ప్రకటనతో ఇక నుంచి సిక్కోలు టీడీపీ రాజకీయం…. గుండ వర్సెస్ గొండుగా మారబోతోందా అని కూడా మాట్లాడుకుంటున్నారు. గుండ దంపతుల చిన్న కుమారుడు విశ్వనాథ్ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించడం స్థానిక టీడీపీలో కలకలం రేపుతోంది. ముందు ముందు ఇది గ్రూప్వార్కు దారి తీసే ప్రమాదం ఉందా అన్న చర్చలు సైతం మొదలయ్యాయి. గుండ ఫ్యామిలీకి దశాబ్దాల రాజకీయ నేపధ్యం ఉంది, పైగా…. నీతి, నిజాయితీతో పాలిటిక్స్ చేస్తారని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే చెప్పుకుంటారు. గుండ అప్పల సూర్యనారాయణ రెండు సార్లు మంత్రి పదవి నిర్వహించినా…. ఆస్తులు అమ్మి రాజకీయాలు నడిపారు తప్ప అడ్డగోలుగా సంపాదించలేదన్నది నియోజకవర్గంలో విస్తృతాభిప్రాయం. ఈ క్రమంలో… అమెరికా నుంచి వచ్చిన కొడుకులు
అమ్మతో పాటు తమ కుటుంబాన్ని నమ్ముకున్న కార్యకర్తలు, ప్రజలకు అండగా ఉంటామని ప్రకటించజం సంచలనమైంది. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి వాటికోసం ఆస్తులు అమ్ముకున్నారు తప్ప సంపాదించుకోలేదని పేరున్న గుండ వారసులు ఎంట్రీ ఇస్తే…. పరిణామాలు మారవచ్చన్న విశ్లేషణలున్నాయి.
పేరు, పట్టు ఉన్న పొలిటికల్ ఫ్యామిలీ వారసులు ఇప్పటికే పవర్లో ఉన్న ఎమ్మెల్యేతో ఎలా అడ్జెస్ట్ అవుతారన్న ప్రశ్నలు సైతం తెర మీదికి వస్తున్నాయి. అప్పల సూర్యనారాయణ పెద్ద కుమారుడు శివగంగాధర్ ఐక్యరాజ్యసమితిలో కీలక బాధ్యతల్లో ఉండగా, చిన్న కొడుకు విశ్వనాథ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో సైంటిస్ట్గా పని చేస్తున్నారు. ఇకపై విశ్వనాథ్ శ్రీకాకుళంలోనే ఉంటారని స్వయంగా శివగంగాధరే తమ కుటుంబ అభిమానులకు చెప్పారని, దీన్నిబట్టి చూస్తుంటే… పొలిటికల్ ఎంట్రీ విషయంలో అన్నదమ్ములిద్దరూ కలిసి ఓ క్లారిటీకి వచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ అధిష్టానానికి కూడా ఈ కుటుంబంపై ప్రత్యేక అభిమానం ఉందన్నది పార్టీ ఇంటర్నల్ టాక్. గత ఎన్నికల్లోనే అప్పల సూర్యనారాయణ కుమారులను రాజకీయాల్లోకి ఆహ్వానించారట చంద్రబాబు. కానీ… అప్పుడు ఎవరూ ఆసక్తి చూపించలేదు. తండ్రి మరణం తర్వాత వారి ఆలోచన మారినట్టు తెలుస్తోంది. ఇక గుండ వారసులు గనుక డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేసి ప్రజాక్షేత్రంలోకి వస్తే…. శ్రీకాకుళం రాజకీయాల్లో కొన్ని మార్పులు కనిపిస్తాయని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. అదే సమయంలో ఎమ్మెల్యే గొండు శంకర్ వైఖరి ఏంటన్న సస్పెన్స్ కూడా పెరుగుతోంది. పార్టీ పెద్దలు ఈ రెండు వర్గాలను ఎలా సమన్వయం చేస్తారో చూడాలి మరి.