అక్కడ బీజేపీ మాటలు కోటలు దాటినా…. చేతలు గడప దాటలేదు ఎందుకు? గెలుస్తామనుకున్న మున్సిపాలిటీలో సింగిల్ డిజిట్ వార్డులకే ఎందుకు పరిమితం కావాల్సి వచ్చింది? కాషాయ పార్టీ అట్టర్ ఫ్లాప్ షోకు బాధ్యులు ఎవరు? పార్టీ ఎమ్మెల్యే ఉన్నచోట కూడా ఎందుకు ఆ దుస్థితి వచ్చింది? తప్పు ఎక్కడ జరిగింది.. లెక్కలు ఎలా తప్పాయి?లెట్స్ వాచ్.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో.. బీజేపీకి పట్టుంది. కాషాయం కంచుకోటల్లో.. ఆర్మూర్ పట్టణం ఒకటని నమ్ముతారు ఆ పార్టీ పెద్దలు. అందుకు తగ్గట్టే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి 18వేల మెజార్టీతో గెలిచారు. అలాగే… లోక్సభ ఎన్నికల్లోనూ.. ఆర్మూర్ టౌన్లో ఆ పార్టీకి చెప్పుకోతగ్గ ఓట్లు పడ్డాయి. పటిష్టమైన క్యాడర్, బలమైన సంఘ్ పరివార్ నేతలు ఉండటం ఇక్కడ మనకు ప్లస్ అంటూ లెక్కలేసుకుంటూ ఉంటారు కమలం లీడర్స్. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో.. ఆర్మూర్ పీఠం మనదేనని గట్టిగా నమ్మారు. బయట కూడా ఈ టౌన్ బీజేపీదే అనేలా.. టాక్ నడిచింది. కానీ… తీరా చూస్తే…. యాంటీ క్లైమాక్స్ కనిపించింది. ఫలితాలు తలకిందులై ఆ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చాయి. స్థానికంగా బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ.. కేవలం 8 వార్డులనే గెల్చుకోవడం ఏంటో అర్ధంగాక పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారట. అసలు ఎక్కడ తేడా కొట్టిందంటూ ఎవరికి వారు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా.. 19 చోట్ల గెలిచి ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కానీ… అంత హైప్ ఉన్న బీజేపీ మాత్రం సింగిల్ డిజిట్కే పరిమితమై కొత్త సందేహాలకు లేవనెత్తిందంటున్నారు పరిశీలకులు. ఇక్కడ బీఆర్ఎస్ ఐదు, స్వతంత్రులు ముగ్గురు గెలవగా.. ఎంఐఎం అభ్యర్ధి ఒక చోట విజయం సాధించారు. గెలుపు మాదేనని ధీమాగా ఉన్న బీజేపీ కేడర్ ఫలితాల షాక్ నుచి ఇంకా కోలుకోలేకపోతోందట. దీంతో అట్టర్ ప్లాప్ షోకు.. కారణం ఎవరన్న చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది.
ఆర్మూర్ ఫలితాలపై విశ్లేషణ చేస్తామని పార్టీ ఎంపీ సైతం అనడం, లోకల్ కేడర్కు ఎంపీ అర్వింద్ క్షమాపణ చెప్పడం లాంటి పరిణామాల్ని చూస్తుంటే…. ఇదేం యాదృచ్చికంగా జరిగింది కాదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు కొందరు. పట్టణంలో బలమైన క్యాడర్ ఉండటం, స్థానికంగా పార్టీ ఎమ్మెల్యే ఉండటం లాంటి బలమైన కారణాలు చాలానే కనిపిస్తున్నా… గెలుపునకు బదులు సింగిల్ డిజిట్కే పరిమితం కావడం వెనకున్న కథల్ని వెలికితీసే పనిలో పార్టీ పెద్దలున్నట్టు సమాచారం. ఆల్రెడీ రంగంలోకి దిగి విశ్లేషణలు మొదలుపెట్టినట్టు సమాచారం. సీనియర్ లీడర్స్ మధ్య అంతర్గత విబేధాలు, పట్టణంలో ముఖ్య నేతలు పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..? ఎలక్షన్ టైంలో సీనియర్స్ ఇళ్ళకే ఎందుకు పరిమితం కావాల్సి వచ్చింది లాంటి అనేక అంశాలపై చర్చ జరుగుతోందట. వాటన్నిటికీ మించి కాంగ్రెస్ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్దిగా ప్రచారంలో ఉన్న నాయకుడు పోటీ చేసిన వార్డులో బీజేపీ తన అభ్యర్థిని ఎందుకు నిలపలేదన్నది బిగ్ క్వశ్చన్.
ఈ విషయంలో తెర వెనుక ఏం జరిగిందంటూ…. అన్ని అంశాలపై పార్టీ బాధ్యులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట తీరు, వాడే భాష సైతం ఫలితాలపై ప్రభావం చూపిందనే చర్చ ఉంది. ఆయన దూకుడు తత్వం అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్కు కారణం కాగా.. మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి అదే మైనస్ అయిందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి ఆర్మూర్లో. ఎమ్మెల్యే వైఖరి పార్టీని కూడా బలహీనపరుస్తోందని అంటున్నారు. సాధారణంగా….ఎన్నిక ఏదైనా దగ్గరుండి పర్యవేక్షించే ఎంపీ అర్వింద్.. ఆర్మూర్ మున్సిపాలిటీని ఎమ్మెల్యేకే వదిలేశారట. ఆయన పర్యవేక్షణ లేకపోవడం కూడా మెరుగైన ఫలితాలు రాకపోవడానికి ఓ కారణంగా చర్చ జరుగుతోంది. అందుకే… రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతను ఎంపీనే తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఆర్మూర్ ఫలితాల్లో లెక్క ఎక్కడ తప్పిందో….అది కాకతాళీయమా లేక కావాలనే జరిగిందా? తెర వెనక సంగతులేంటో… పార్టీ పెద్దలు తేల్చాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది ఆర్మూర్ కాషాయ దళంలో.