Off The Record: సముద్రం నిండా నీళ్ళున్నా.. తాగడానికి చుక్క పనికిరావన్నట్టుగా ఉందట అక్కడ గులాబీ పార్టీ పరిస్థితి. చెప్పుకోవడానికి అబ్బో… చాలా పెద్ద పెద్ద నాయకులే ఉన్నారు. కానీ… జిల్లాలో కేడర్ని నడిపించే దిక్కు మాత్రం లేదు. ఒకప్పుడు మీసాలు మెలేసి, తొడలు కొట్టిన నేతలున్న చోట ఇప్పుడా పరిస్థితి ఎందుకొచ్చింది? ఏ జిల్లాలో అంత దారుణంగా ఉంది బీఆర్ఎస్?
Read Also: Delhi High Court: భర్త వివాహేతర సంబంధం, భార్య ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు..
పెద్దపల్లి జిల్లా.. కోల్ బెల్ట్ ఏరియాతో పాటు అటు పారిశ్రామికంగానూ.. ఇటు వ్యవసాయ పరంగానూ ప్రాధాన్యత ఉన్న ప్రాంతం…. తెలంగాణ ఏర్పడ్డాక ఈ జిల్లాలో గణనీయమైన విజయాలు సాధించింది బీఆర్ఎస్. రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాలు పూర్తిగానూ, ధర్మపురి పాక్షికంగానూ ఈ జిల్లా పరిధిలో ఉన్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లా పరిధిలో ఒక్క సీటు కూడా గులాబీ పార్టీకి దక్కలేదు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈ గ్యాప్లో సాధారణ ఎన్నికలను తలపించేలా జరిగే సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో అస్సలు పోటీనే చేయలేదు. వరుస ఓటములతో క్యాడర్ నిస్తేజం పెరిగిపోయింది. వాళ్ళని కదిలించి పార్టీ పునాదులను కాపాడాల్సిన నేతలు కూడా నాకేం సంబంధం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట.. దీంతో పెద్దపల్లి జిల్లాలో కార్ పార్కింగ్ షెడ్కే పరిమితం అయ్యిందని అంటున్నారు. ఓడిపోయాక ఏదో… నామ్కే వాస్తే తప్ప ఐక్యంగా నిర్వహించిన ప్రోగ్రాం ఒక్కటి కూడా పోవడాన్ని బట్టే.. పెద్దపల్లి జిల్లా గులాబీ దళంలో ఐకమత్యం ఏ మాత్రం ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు.
Read Also: Sophia Qureshi: కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు
అయితే, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు.. ఓ మాజీ మంత్రి ఉన్నా.. తలో దిక్కుగా వెళ్తున్నారు. జిల్లా అధ్యక్షుడుగా ఉన్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పార్టీని పట్టాలెక్కించేందుకు చేసిన ఒకటి రెండు కార్యక్రమాలకు మిగతావారిని నుంచి పెద్దగా స్పందన లభించకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదట ఆయనకు. పార్టీ పెద్దలకు ఈ విషయాలను చెప్పినా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్ళినట్టు తెలిసింది. పెద్దపల్లి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇన్ఛార్జ్ కాగా… మంథనికి పుట్టా మధు, రామగుండానికి కోరుకంటి చందర్, ధర్మపురికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. దాసరి మనోహర్రెడ్డి ఓటమి తర్వాత అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారట. కేవలం కేటీఆర్, హరీష్ కవితలు కార్యక్రమాల్లో మినహా పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల జిల్లా అధ్యక్షుడు చందర్ గోదావరి గోస పేరుతో ఓ పాదయాత్ర నిర్వహించారు.
Read Also: Final Destination Bloodlines: వెన్నులో వణుకు పుట్టించే సినిమా.. ఈనెల15 అర్ధరాత్రి బెనిఫిట్ షో..
ఇక, ఆ యాత్ర పెద్దపల్లి మీదుగా వెళ్లినప్పటికీ దాసరి అటువైపే చూడకపోవడం చర్చనీయాంశంగా మారింది… ఇది పార్టీ మీద అలకనా అంటే.. పెద్ద లీడర్ల ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి.. జిల్లాలో ఉన్న గ్రూప్ వార్ వల్లనే అన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. అటు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు అయితే తన దారి రహదారి అన్నట్టుగా ఉంటున్నారట.. జిల్లాలోని ఇతర నేతలను కలుపుకోవడం లేదని మొదటి నుంచి ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.. నిన్నా మొన్నటి వరకు జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఉన్న మధుకు ఇతర నేతలతో అంత సఖ్యత లేదట. అదే వ్యవహార శైలిని పార్టీ అధికారం కోల్పోయాక కూడా కొనసాగిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈమధ్య కాళేశ్వరంలో నిర్వహించిన
కార్యక్రమంలో జిల్లాకు చెందిన నేతలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదట.. పక్కనే ఉన్న మంచిర్యాల, జగిత్యాల మాజీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనగా.. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దూరంగా ఉన్నారట.. అటు జిల్లా అధ్యక్షుడు చందర్తో మాత్రమే వైరం ఉందని ప్రచారం జరుగుతున్న టైంలో.. పుట్టా మధుకర్ నిర్వహించిన కార్యక్రమంలో కూడా పాల్గొనకపోవడంతో ముగ్గరు నేతల మధ్య వార్ నడుస్తోందన్న ప్రచారం మొదలైంది.
Read Also: KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు సిద్ధం కావాలి..
కాగా, ఈ ముగ్గురు మాజీలను సమన్వయం చేసి ఒక్కతాటిపై నడిపే బాధ్యతను పార్టీ పెద్దలు మాజీ మంత్రి కొప్పులకు అప్పగించగా ఆయన పరిశీలించడం తప్ప పరిష్కారం చూపడం లేదట.. దీంతో ఈ వార్ రోజు రోజుకు మదురుతోందని అంటున్నాయి గులాబీ వర్గాలు. ముగ్గురితో సాన్నిహిత్యం ఉండి.. కార్ గేర్ మార్చి ముందుకు నడపాల్సిన కొప్పుల ఎవరెక్కడ పోతే నాకేంటి అన్నట్టుగా మిన్నకుండిపోతున్నారంటూ మండిపడుతోందట బీఆర్ఎస్ కేడర్. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ ముగ్గురి మధ్య అభిప్రాయ భేదాలు రాగా.. ఇప్పుడు మరింత జఠిలమయ్యాయని అంటున్నారు దగ్గరగా గమనిస్తున్నవారు… గోదావరి ఇసుక వ్యవహారం.. బూడిద ఎపిసోడ్.. మట్టి క్వారీలు, సింగరేణి యూనియన్ వ్యవహారాల్లో… గతంలో ఒకరిపై ఒకరు పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేసుకున్నట్టు సమాచారం.. జడ్పీ చైర్మన్గా తమ నియోజకవర్గాలను ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో పుట్టామధుకర్కు మిగతా ఇద్దరికి మధ్య కోల్డ్ వార్ మొదలైందట. అప్పట్లో ప్రోటోకాల్ పాటించలేదని ఆయన కూడా అలిగినట్టు వార్తలు వచ్చాయి.. ఏదైతేనేం.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఐక్యంగా ఉండాల్సిన నేతలు ఒకరంటే ఒకరికి పడనట్టుగా వ్యవహరించడంతో క్యాడర్ ఆయోమయంలో పడింది. అటు ప్రజల్లోకి వెళ్లకుండా.. ఇటు పార్టీని పట్టించుకోకుండా ఉంటున్న నేతల్లో కదలిక రావారలంటే… అధిష్టానం డైరెక్ట్గా జోక్యం చేసుకోవాలంటున్నారు పెద్దపల్లి గులాబీ కార్యకర్తలు.