Off The Record: అక్కడ కాంగ్రెస్ పార్టీలో రేగిన రాజకీయ కార్చిచ్చు ఇప్పట్లో ఆరదా? అసలు దాన్ని ఆర్పే సామర్ధ్యం ఉన్నవాళ్ళు ఎవరూ తెలంగాణ కాంగ్రెస్లో లేరా? ఎంతసేపూ…. అభిప్రాయ సేకరణ పేరుతో కాలం వెళ్ళదీస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం కోసం ఆలోచించడం లేదా? ఇంతలా అధిష్టానానికి తలనొప్పిగా మారిన ఆ నియోజకవర్గం ఏది? అక్కడేం జరుగుతోంది?
Read Also: CV Anand: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు అంతర్జాతీయ అవార్డు.. ఏకంగా 138 దేశాలు పోటీ!
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్లో కల్లోలం కొనసాగుతూనే ఉంది. నిరుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పార్టీ మార్పుతో మొదలైన వివాదం తీవ్ర తుఫాన్గా మారుతోందేతప్ప తీరం దాటడం లేదు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేంత రాజకీయ వైరం ఉంది. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు కాటా శ్రీనివాస్ గౌడ్, స్థానిక కాంగ్రెస్ నాయకులపై మహిపాల్ రెడ్డి అక్రమ కేసులు పెట్టించి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారనేది కాంగ్రెస్ నాయకుల అభియోగం. ఈ సారి ఎన్నికల్లో కాటా ఓడిపోయినా.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులకు కొంత ఊరట కలిగింది. కానీ.. అధికారం వచ్చిన ఆరు నెలల్లోనే పటాన్ చెరులో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Read Also: Off The Record: ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి గ్యాప్ పెరుగుతుందా..?
అయితే, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు మహిపాల్ రెడ్డి చేరికను బహిరంగంగా వ్యతిరేకించారు. తమ మీద కేసులు పెట్టి జైలుకు పంపిన ఎమ్మెల్యేని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థి నీలం మధు, కాటా శ్రీనివాస్ వర్గాలు ఉండగా మహిపాల్ రెడ్డి రాకతో మూడు ముక్కలాటగా మారిపోయింది పార్టీ పరిస్థితి. ఈ క్రమంలో… మొన్న జనవరిలో ఎమ్మెల్యే… నియోజకర్గంలోని కాంగ్రెస్ నాయకులను పట్టించుకోవడంలేదని, అభివృద్ది కార్యక్రమాలకు తమని ఆహ్వానించడంలేదని ఆందోళనకు దిగింది కాటా వర్గం. అసలు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. క్యాంప్ కార్యాలయంపై దాడి చేసి అందులో సీఎం రేవంత్ ఫోటో లేకపోవడంతో ఫోటో పెట్టారు కాంగ్రెస్ నాయకులు.ఈ ఘటన తర్వాత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నేత వినోద్ రెడ్డితో కలిసి పటాన్ చెరు వివాదంపై కమిటీ వేసింది పీసీసీ . ఈ కమిటీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయాలను తీసుకుంది. ఆ తర్వాత కొన్నిరోజులు పాటు గొడవ సద్దుమణిగింది.
Read Also: India Pakistan: ‘‘నోటామ్’’ జారీ చేసిన భారత్.. పాక్ సరిహద్దుల్లో ఎయిర్ఫోర్స్ యుద్ధ విన్యాసాలు..
ఇక, తాజాగా ఈ నెల 4న జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో వర్గవిబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఇందిరమ్మ కమిటీల్లో ఎమ్మెల్యే పెత్తనం ఎందుకంటూ జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ ముందే గొడవపడ్డారు కాంగ్రెస్ నాయకులు. అలాగే నామినేటేడ్ పోస్టుల భర్తీలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇచ్చిన పేర్లను ప్రకటిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించగా.. అక్కడే ఉన్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వారికి నచ్చజెప్పి సముదాయించారు. సమావేశం అనంతరం రామ్మోహన్ రెడ్డి వారితో సమావేశం కాగా మహిపాల్ రెడ్డికి పార్టీ ప్రాధాన్యత ఇచ్చినట్టు తేలితే తామంతా పార్టీకి రాజీనామా చేస్తామని అల్టిమేటం జారీ చేశారట పాత కాంగ్రెస్ లీడర్స్. ఇక పటాన్ చెరు వివాదంపై కమిటీ సభ్యులుగా ఉన్న ఆది శ్రీనివాస్, వినోద్ రెడ్డి ఇప్పటికే జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా పార్టీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి నుంచి అభిప్రాయ సేకరణ జరపగా.. ఇప్పుడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో సమావేశం అయ్యారట. అందరి అభిప్రాయాలను తీసుకున్న ఈ కమిటీ త్వరలోనే ఆ నివేదికను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కి ఇచ్చే అవకాశం ఉంది.
Read Also: Pakistan: భారత్తో ఉద్రిక్తత.. రక్షణ బడ్జెట్ని 18% పెంచిన పాకిస్తాన్..
జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ముగ్గురు నేతలు కూడా కమిటీకి ఓకే విషయం చెప్పనట్టు సమాచారం. పార్టీలో గత పదేళ్లుగా ఉన్నవారికే నామినేటేడ్ పోస్టులు ఇవ్వాలని… కొత్తగా వచ్చిన వారిని పరిగణనలోకి తీసుకోద్దని సూచించారట. కాట శ్రీనివాస్కి సముచిత స్థానం ఇవ్వాలని, కాటా, గూడెం మహిపాల్ రెడ్డి ఇద్దరిని పార్టీ సమన్వయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పినట్టు తెలిసింది. లేకపోతే నియోజకవర్గంలో పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని పెద్దలు అభిప్రాయం చెప్పారట. జఠిలమైన పటాన్ చెరు సమస్యను పరిష్కరించడమంటే కత్తి మీద సామేనని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అధిష్టానం ఎలాంటి పరిష్కారం చూపుతుందోనని ఉత్కంఠగా ఉన్నాయి పటాన్చెరు కాంగ్రెస్ శ్రేణులు.