సభలో ఓ సభ్యుడి తీరు బాగా లేదని డిసైడ్ చేశారు. సీరియస్గా డిస్కస్ చేశారు. ఎథిక్స్ కమిటీ వేయాలని డిసైడయ్యారు. మరి ఆ కమిటీని వెంటనే వేస్తారా? లేక ఆలస్యం అవుతుందా? అసలు ఆ దిశగా కసరత్తు మొదలైందా? ఒకవేళ మొదలైతే… ఏ దశలో ఉంది? అసలు ఏ సభ్యుడి తీరు అంత అభ్యంతరకరంగా ఉంది? మిగతా సభా కమిటీల సంగతేంది? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ విడత రెండు అంశాలను సీరియస్గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. సభలో…..స్పీకర్ పోడియం ముందు brs సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందని, ఆ సంగతేందో తేల్చేయాలని డిసైడ్ అయ్యింది. ఆయన సభలో సభ్యుల పట్ల, కడియం శ్రీహరి లాంటి సీనియర్ నేతతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అధికార పార్టీ సభ్యులు.
కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సభలోనే పట్టుపట్టారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సభ్యులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి… సంపత్లను నిబంధనల అతిక్రమణ పేరుతో సభ్యత్వం రద్దు చేశారు అప్పటి స్పీకర్. ఇప్పుడు కూడా అదే తరహాలో పాడి కౌశిక్రెడ్డి మీద వేటు వేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. వెంటనే వేటు వేయాలని సభలో ఒత్తిడి పెరిగింది. అయితే… ప్రభుత్వం హుందాగా వ్యవహరించాలి, వత్తిడి పేరుతో నిబంధనలు ఉల్లంఘించడం సరికాదన్న ఉద్దేశ్యంతో…. కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని తేల్చేందుకు ఎథిక్స్ కమిటీ వేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. కమిటీ వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ నిర్ణయం తీసుకున్నారు కూడా. కానీ… నియామకం మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. కానీ… కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇక్కడే కొన్ని కొత్త ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎథిక్స్ కమిటీ వేసినా… విచారణకి సమయం పడుతుంది. అది ఎంతన్న విషయంలో క్లారిటీ లేదు. అందుకే….బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యవహారాన్ని తేల్చేందుకు నిర్ణీత కాల వ్యవధిని కూడా పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం.
ఆ సంగతి అలా ఉంచితే… అసలు కమిటీలో ఎవరెవరు ఉంటారు..? కూర్పు ఎలా ఉంటుంది… ప్రతిపక్షం నుండి ఎవరికి ఛాన్స్ ఇస్తారన్న చర్చలు జోరుగా నడుస్తున్నాయి. హేట్ స్పీచ్ కి స్పందించిన బిల్లును సభలో చర్చకు పెట్టింది ప్రభుత్వం. దాన్ని రూల్స్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. దాంతో… ఇప్పుడు రూల్స్ కమిటీ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో…రెండు అంశాలకు సంబంధించిన కమిటీల్ని ఈ వారంలో వేస్తారా? లేక సమయం పడుతుందా అన్న విషయంలో స్పష్టత లేదు.
అటు ప్రతిపక్షం కూడా కమిటీల నియామకంపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. అసెంబ్లీలో చాలా కమిటీల నియామకం పెండింలో ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది విపక్షం. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు కూడా సభలో ఈ అంశాలను ప్రస్తావించారు. అయినాసరే… నియామక ప్రక్రియ ఎప్పటికి అవుతుందన్న విషయంలో క్లారిటీ లేదు. ఎప్పటికి వస్తుందో కూడా చెప్పలేమంటున్నాయి శాసనసభ వర్గాలు. కానీ… ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి విషయంలో మాత్రం కాంగ్రెస్ సభ్యులు పట్టుదలగా ఉన్నారు. అందుకే ఎక్కువ సమయంలో తీసుకోకపోవచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి. ఒకసారి ఎధిక్స్ కమిటీ వేస్తే… దాంతో పాటే మిగతా వాటికి పెద్ద టైం తీసుకోకపోవచ్చని అంటున్నారు. కమిటీ వేశాక పని ఎలా మొదలుపెడుతుంది…ఎక్కడ ముగిస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.