ఆ పొలిటికల్ ఫ్యామిలీ కమలం నుంచి గులాబీ వైపు చూస్తోందా? బీఆర్ఎస్ పెద్దలు కూడా వాళ్ళు వస్తే బాగుండునని అనుకుంటున్నారా? ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్న ఆ కుటుంబంలోని యువ నాయకుడు ప్రస్తుతం నియోజకవర్గంలో సఫకేషన్ ఫీలవుతున్నారా? ఇంతకీ ఏదా ఫ్యామిలీ? ఏంటా పొలిటికల్ ఇబ్బంది? 2024 లోక్సభ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానానికి పరిమితం అయ్యారు భరత్ ప్రసాద్. ఇక ఓటమి తర్వాత ఆయన నియోజకవర్గానికి ముఖం చాటేసినట్టు చెప్పుకుంటున్నారు స్థానికంగా. ఎన్నికలప్పుడే మనకు ప్రజా సంబంధాలతో పని, ఇప్పుడు వాటి అవసరమేముంది, అసలే ఓడిపోయాం, మళ్ళీ ఎన్నికలప్పుడు చూసుకుందాంలే అన్న ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది.
నాగర్కర్నూల్ పార్లమెంట్తో పాటు అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మారే పరిణామాలు, ఈక్వేషన్స్తో అప్పటి పరిస్థితికి తగ్గట్టు చూసుకుందాం… ఇప్పట్నుంచే వృధా ప్రయాస ఎందుకన్నట్టుగా భరత్ప్రసాద్ వ్యవహారశైలి ఉందని అంటున్నారు. ఇక ఇటీవలి సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో తన వారికోసమో, లేదా పార్టీ అభ్యర్థుల కోసమో ప్రచారం చేసిన దాఖలాలు లేవట. గతంలో జడ్పీటీసీగా గెలిచిన భరత్, నాగర్ కర్నూల్ జడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించి భంగపడ్డారు. అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కుట్రల కారణంగానే తనకు జడ్పీ ఛైర్మన్ పదవి దక్కలేదని బహిరంగంగానే విమర్శలు చేశారాయన. ఆ తరువాత గత అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నించారు.
ఎన్నికలకు ముందు నియోజకవర్గం వ్యాప్తంగా తన తండ్రి, మాజీ ఎంపీ రాములుతో కలిసి విస్తృతంగా పర్యటించారు. కానీ… అప్పుడు టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వలకే దక్కడం, ఎంపీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ టిక్కెట్ను సిట్టింగ్ అయిన రాములుకు టికెట్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ చెప్పేయడంతో తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి కాషాయ కండువా కప్పుకున్నారు. అప్పట్లో టిక్కెట్ హామీతోనే బీజేపీలోకి జంప్అయిపోయి తెచ్చుకున్నా… సెకండ్ ప్లేస్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మోడీ ఛరిష్మా, రాములు మృదు స్వభావి, భరత్ యువకుడన్న ఈక్వేషన్స్ అన్నీ కలిసివచ్చి భరత్ గట్టి పోటీ ఇచ్చారని, ఒక దశలో గెలుపు ఖాయన్నంతగా వేవ్ క్రియేట్ అయిందని అప్పట్లో చెప్పుకున్నారు. ఫైనల్గా రిజల్ట్ మాత్రం అనుకూలంగా రాలేదు. ఇదిలా ఉంటే…. భరత్కు ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి, అసెంబ్లీ లో అడుగు పెట్టాలనే ఇంట్రస్ట్ ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.
తన తండ్రిని పలుమార్లు గెలిపించి అసెంబ్లీకి పంపిన అచ్చంపేట ప్రజా క్షేత్రాన్నే ఇష్టపడుతున్నారట ఆయన. అయితే అచ్చంపేటలో ఓటమి తర్వాత గువ్వల బాలరాజు కూడా బీజేపీలోకే రావడం భరత్కు ఇబ్బందికరంగా మారినట్టు చెబుతున్నారు. అచ్చంపేటలో బీజేపీ తరపున గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకున్న భరత్ ప్లాన్స్కు గువ్వల చేరిక ఆటంకంగా మారినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రాములు, భరత్ కలిసి… తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశాలు లేకపోలేదన్న ప్రచారం సైతం జరుగుతోంది. అచ్చంపేటలో పూర్తిస్తాయి పట్టున్న రాములు, భరత్ని కారెక్కించుకుంటే పార్టీకి సరైన నాయకులు దొరకడంతో పాటు కొత్త జోష్ వస్తుందన్న ఆలోచన ఉందట గులాబీ పెద్దలకు. ఇలాంటి ప్రచారాలు, పరిణామాలతో ముందు ముందు అచ్చంపేట రాజకీయ పరిణామాలు ఎలా మారతాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.