ఆ మాజీ ఎమ్మెల్యేకు తత్వం బోథపడిందా? అందుకే అనుచరులు ఎంత టెంప్ట్ చేస్తున్నా…. మీరాగండ్రా బాబూ…. అని సర్ది చెబుతున్నారా? ఒకప్పుడు ఫుల్ వాల్యూమ్లో వినిపించిన వాయిస్… ప్రస్తుతం మ్యూట్ మోడ్లోకి వెళ్ళడం వెనక అసలైన రియలైజేషన్ ఉందా? రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న అంశం మీద ఆ వైసీపీ ముఖ్యుడు ఎందుకు మాట్లాడ్డం లేదు? ఎవరాయన? సీఎం చంద్రబాబును ఉద్దేశించి మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు, తర్వాత ఆయన ఇంటి మీద టీడీపీ శ్రేణుల దాడుల వ్యవహారం ఏపీలో పొలిటికల్ ప్రకంపనలు రేపుతోంది. దీనికి సంబంధించి సవాళ్ళు, ప్రతి సవాళ్ల పర్వం నడుస్తోంది. ఇదే సమయంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. 2020లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా….అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ద్వారంపూడి. అలాగే…. లోకేష్, పవన్కళ్యాణ్ను కూడా తిట్టారు. దానికి సంబంధించి అప్పట్లో టీడీపీ, జనసేన వర్గాలు ఆందోళనలు నిర్వహించాయి కూడా. ఇంట్లోకి దూసుకుని వచ్చే ప్రయత్నం చేయగా…ఆ కేసులు ఇంకా నడుస్తున్నాయి.
Top Headlines @5PM : టాప్ న్యూస్
అయితే…. అదంతా గతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అయింది. కానీ… అప్పట్లో అంత తీవ్రంగా మాట్లాడిన చంద్రశేఖర్రెడ్డి విషయంలో ఇంతవరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని మాట్లాడుకుంటున్నారు కాకినాడ తమ్ముళ్ళు. అంబటి రాంబాబు అరెస్ట్ క్రమంలో…. ఇప్పుడు టీడీపీ నాయకులు ద్వారంపూడి ప్రస్తావన తీసుకురావడం ఉత్కంఠ రేపుతోంది. అప్పుడంటే…. ప్రతిపక్షంలో ఉన్నాం, ఓకే అని సరిపెట్టుకున్నాం. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా చట్టపరమైన చర్యలు తీసుకుని ఉండాల్సిందంటూ మరోసారి వాయిస్ రెయిజ్ చేస్తున్నారు కాకినాడ టీడీపీ నాయకులు. అప్పుడు అంత వైలెంట్గా బిహేవ్ చేసి… ఇప్పుడు ఏమీ తెలియదన్నట్టు సైలెంట్ అయిపోతే సరిపోతుందా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. కామ్ అయిపోతే చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోతాయా అని ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు కొందరు. గుంటూరు దూకుడు కాకినాడకు వచ్చేసరికి చల్లబడిపోయిందా అంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. ఎప్పుడూ కింది స్థాయిలో మేం నలిగిపోవడం తప్ప పెద్దవాళ్ళంతా బాగానే ఉంటారంటూ నిష్టూరంగా మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో అటు వైసీపీలో కూడా ద్వారంపూడి గురించి డిఫరెంట్గా మాట్లాడుకుంటున్నారట. ప్రస్తుతం అంబటి రాంబాబు ఎపిసోడ్లో వైసీపీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నా… ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
మరీ… స్పీడైపోతే… ఏం జరుగుతుందో తత్వం బోధపడే గతంలో ఉన్న ఫైర్ని ఎక్కడా సార్ చూపించడం లేదని మాట్లాడుకుంటున్నారు. అంబటి ఇష్యూ మీద హడావిడి చేద్దామని అనుచరులు ఎవరైనా అంటే…. ద్వారంపూడి వైపు నుంచి రిప్లై ఉండడం లేదట. గతంలో తాను కూడా దాదాపు అవే తరహా కామెంట్స్ చేశానని, ఇప్పుడు హంగామా చేస్తే…. తవ్వకాలు జరిపే ప్రమాదం ఉందని చంద్రశేఖర్రెడ్డి సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. కొన్ని విషయాలు కనిపించినా కనిపించనట్టు, వినిపించినా వినిపించనట్టుగా ఉండాలంటూ…. మాజీ ఎమ్మెల్యే తనచరులకు హితబోధ చేస్తున్నారట. ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవు.. కొద్ది రోజులు జరిగేది చూద్దాం, జరగాల్సింది కాలమే నిర్ణయిస్తుందంటూ వేదాంతం చెబుతున్నట్టు తెలిసింది. మొత్తానికి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల జోలికి వెళ్తే తనకే కొత్త చిక్కులు రావడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే ఫిక్స్ అయ్యారని అంటున్నారు ఆయన అనుచరులు. దీంతో… తత్వం బోథపడటమంటే ఇదేనేమో అన్న చమత్కారాలు వినిపిస్తున్నాయి కాకినాడలో.