Off The Record: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తొలిసారి అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ అమరావతికి అంకురార్పణ చేసింది. అందుకు అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా ఓకే చెప్పింది. కానీ… 2019లో అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా యూ టర్న్ తీసుకుని మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. దీంతో… అప్పటికే ప్రారంభమైన అమరావతి నిర్మాణ పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. కట్ చేస్తే… ఐదేళ్ళ తర్వాత సీన్ తిరగబడింది. వైసీపీ ఓడిపోయి టీడీపీ సారధ్యంలోని కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చింది. వెంటనే… అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టేసింది. ప్రధాని మోడీ వచ్చి రీ లాంఛ్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో. అందుకు సమాధానంగానా అన్నట్టు తాజాగా రియాక్ట్ అయ్యారు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై మాట్లాడిన మాజీ సీఎం… రాజధాని విషయంలో తమ వైఖరి ఏంటో క్లారిటీ ఇచ్చేశారు. దాన్ని బట్టి చూస్తుంటే… మూడు రాజధానుల స్టాండ్ నుంచి వైసీపీ యూ టర్న్ తీసుకున్నట్టే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
Read Also: NITI Aayog: నేడు మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. హాజరుకానున్న సీఎంలు
అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోందని మరోసారి ఆరోపించారు జగన్. అంచనాలను అమాంతం పెంచేశారని, జ్యుడిషియల్ ప్రివ్యూను రద్దు చేశారని, స్కాంల కోసమే మొబలైజేషన్ అడ్వాన్స్లు తెచ్చారని ఆరోపించారాయన. ప్రస్తుతం జరిగే పనులకే 70 వేల కోట్లకుపైగా నిధులు కావాలని, దాని కోసం ఎడాపెడా అప్పులు చేస్తున్నారంటూ విమర్శించారు.. రాజధాని పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు పూర్తిగా నాశనం చేస్తున్నారని అన్నారు వైసీపీ అధ్యక్షుడు. అంతవరకు ఓకే… దాదాపు ఇలాంటి ఆరోపణలు, విమర్శలే గతంలో కూడా చేశారు. కానీ… అప్పుడంతా.. మూడు రాజధానుల మూడ్లో ఉండేవారు. కానీ… ఇప్పుడు అందుకు భిన్నమైన స్టేట్మెంట్ రావడం గురించే మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. రాజధాని పేరుతో ఒకే చోట లక్షల కోట్ల రూపాయల్ని కుమ్మరించటడం ఎందుకు? అదే రాజధానిని నాగార్జున యూనివర్సిటీ భూముల్లోనో లేక విజయవాడ గుంటూరు మధ్య ఒక 500 ఎకరాల్లోనో కట్టేయవచ్చుకదా అని సూచించారాయన. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, ఆ పేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయటానికి మాత్రమే వ్యతిరేకమని వివరించే ప్రయత్నం చేశారు జగన్. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెబుతూనే లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాజధాని నిర్మాణాలు చేపడ్డటమంటే… రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేయడమేనని మాజీ సీఎం ముక్తాయించడాన్ని బట్టి చూస్తుంటే…. మూడు రాజధానుల విషయంలో పూర్తిగా యూ టర్న్ తీసుకున్నట్టేనా అన్న డౌట్స్ వస్తున్నాయట రాజకీయ వర్గాల్లో. జగన్ తాజా అభ్యంతరం కేవలం రాజధాని సైజ్, రియలెస్టేట్ కోణం మీద తప్ప అమరావతి ఏకైక రాజధాని అన్న విషయంలో కాదని అర్ధమవుతోందంటున్నారు పరిశీలకులు. ఇందుకు బలమైన రాజకీయ కారణాలు ఉండి ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు.
Read Also: Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!
రాజధాని ప్రాంతంలో వైసీపీ బలహీనపడటం, అమరావతికి వైసీపీ వ్యతిరేకమన్న ప్రచారాలు కొనసాగుతూనే ఉండటంతో ఆ విషయంలో క్లారిటీ ఇవ్వటం కోసమే మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించి ఉండవచ్చంటున్నారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదు.. వేల ఎకరాల భూముల పూలింగ్, లక్షల కోట్ల ఖర్చుతో జరిపే నిర్మాణాలకు మాత్రమే వ్యతిరేకం అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసి ఉంటారని భావిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. వైసీపీకి లాభ నష్టాల సంగతి అటుంచితే మరోసారి వేల ఎకరాల భూములు పూలింగ్ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతున్న టైంలో ఆయన వ్యూహాత్మకంగానే తక్కువ ఖర్చుతో గుంటూరు, విజయవాడల మధ్య రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చని సూచించి ఉండవచ్చంటున్నారు. పనిలో పనిగా ఈ రెండు ప్రాంతాల మధ్య అయితే తమకు అభ్యంతరాలు లేవంటూ వైఖరి ఏంటో స్పష్టం చేసే ప్రయత్నం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు కొందరు. ఈ పాయింట్ను కూటమి ప్రభుత్వం ఎలా రిసీవ్ చేసుకున్నా.. తాము మాత్రం గుంటూరు, విజయవాడ అభివృద్దికి కట్టుబడి ఉంటామని చెప్పకనే చెప్పినట్లు అయిందని విశ్లేషిస్తున్నారు ఇంకొందరు. ఈ ప్రాంతంలో పార్టీకి జరిగిన డ్యామేజ్ని కవర్ చేసుకోవటంలో భాగంగా కూడా అలా మాట్లాడి ఉండొచ్చన్నది ఇంకో వెర్షన్. అలాగే… అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియం అంటూ మరోసారి వేల ఎకరాల భూమిని ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పూలింగ్ చేయాలనుకుంటే… దాన్ని వ్యతిరేకించే వారికి అండగా ఉంటామన్న సంకేతాలు పంపి ఉండవచ్చన్న అభిప్రాయాలు సైతం ఉన్నాయి. మరి అమరావతి విషయంలో వైసీపీ లేటెస్ట్ స్టాండ్ ఏ మేరకు లాభిస్తుంది.. గుంటూరు, విజయవాడ ప్రజలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాన్నది చూడాలి.