Off The Record: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు బోండా ఉమా. ఇప్పటికి మూడుసార్లు పోటీ చేసి రెండు విడతలు గెలిచారాయన. 2019లో కేవలం 23 ఓట్ల తేడాతో ఓడిపోవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. అలా…. వోవరాల్గా…. నియోజకవర్గం మీద ఆయనకు గట్టి పట్టుందని చెప్పుకుంటారు. అందుకు తగ్గట్టే అనుచరగణం కూడా భారీగానే ఉంటుంది. అదే ఇప్పుడు ఎమ్మెల్యేకి తలనొప్పిగా మారుతోందట. తమలో తాము ఆధిపత్య పోరుకు దిగడం, అది వీధి పోరాటాల స్థాయికి చేరుకోవడంతో…. కంట్రోల్ చేయలేక బోండా ఉమకు తల ప్రాణం తోకకు వస్తున్నట్టు తెలుస్తోంది. వాళ్ళని అలాగే వదిలేస్తే… రాబోయే రోజుల్లో ఎక్కడ తన పుట్టి ముంచుతారోనన్న భయం కూడా ఉందట ఎమ్మెల్యేకి. బోండా ఉమా రెండోసారి గెలిచాక అనుచర వర్గం కూడా పూర్తి స్థాయిలో యాక్టివ్ అయింది. ఇదే సమయంలో ఆయనకు సన్నిహితంగా ఉంటున్న మాల్యాద్రి అనే నాయకుడు అంతా తానే అన్నట్టు వ్యవహరిస్తున్నారట. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా….. ఎమ్మెల్యే ఉమా పేరు చెప్పి మాల్యాద్రే చక్రం తిప్పుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మాల్యాద్రి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల్ని టీడీపీ నాయకులే చేస్తున్నారు. అన్ని డివిజన్స్లో తిరుగుతూ… తానే ఎమ్మెల్యే అన్నట్టు బిల్డప్లు ఇస్తూ…. తన ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారన్నది లోకల్ తెలుగుదేశం కేడర్ చెబుతున్న మాట.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో ఎక్కడ బోండా ఉమ ఫ్లెక్సీ పెట్టినా…అందులో తన ఫోటో తప్పకుండా వేయాలంటూ షరతు పెడుతున్నారని, అసలు ఎమ్మెల్యే ఎవరో కూడా అర్ధంకావడం లేదని తమ్ముళ్ళే గుసగుసలాడుకుంటున్నారు. కొన్నిచోట్ల అయితే… స్థానిక నేతలు ఎవరూ లేకుండా కూడా మాల్యాద్రి, ఎమ్మెల్యే ఫోటోతో ఫ్లెక్సీలు పెట్టించడం వివాదాస్పదం అవుతోంది. ఈ విషయమై కొందరు నాయకులు లోలోపల కుతకుతలాడిపోతున్నారట. బోండా ఉమా పుట్టిన రోజు సందర్భంగా గవర్నర్పేటలో పెట్టిన ఫ్లెక్సీల్లో స్థానిక కార్పొరేటర్, మున్సిపల్ కార్పొరేషన్లో పార్టీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాల ఫోటో లేకపోవడం దుమారం రేపింది. ఈ విషయమై బాల, మాల్యాద్రి మధ్య మాట మాట పెరిగి…. మాల్యాద్రి చెయ్యి చేసుకున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నియోజకవర్గ ముఖ్య నాయకులు ఇలా రోడ్డున పడటం గురించి కథలు కథలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం ఎమ్మెల్యేదాకా వెళ్ళడంతో… ఆయన పార్టీ కార్పొరేటర్ బాలాని పిలిచి క్లాస్ పీకారని సమాచారం. అయితే ఈ వివాదానికి ఫ్లెక్సీలు మాత్రమే కారణం కాదని, అంతకు మిచిన వ్యవహారాలు చాలానే ఉన్నాయన్నది ఇన్సైడ్ టాక్.
ఇద్దరి మధ్య ఆర్థికపరమైన విషయాలు, భవన నిర్మాణాల వ్యవహారాలు కూడా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. మాల్యాద్రి కొంత మందితో టీమ్ ఏర్పాటు చేసి… నియోజకవర్గంలోని అన్ని ఆర్థిక వ్యవహారాల్లో తలదూరుస్తున్నారన్నది లోకల్ టాక్. డివిజన్లలో పార్టీ కోసం పనిచేస్తున్న తమను దాటి మాల్యాద్రి అండ్ టీమ్ శృతిమించి వ్యవహరిస్తోందంటూ కొందరు స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ… ఆ సంగతి ఎమ్మెల్యేకి నేరుగా చెప్పలేకపోతున్నారట. ఇదే సమయంలో నియోజకవర్గానికి కీలకమైన బీసెంట్ రోడ్డు వ్యవహారంలో పట్టు కోసం మాల్యాద్రి, నెలిబండ్ల బాల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందట. వ్యవహారం రచ్చకెక్కటానికి అది కూడా ఒక కారణమనేనని అంటున్నారు. వీటన్నిటిపై సీరియస్ అయిన బోండా ఉమా అనుతరుల మీద సీరియస్ అయినట్టు సమాచారం.