Off The Record: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఘట్టం పూర్తయింది. ఇక ఫలితాలు మాత్రమే రావాల్సి ఉంది. ఈ క్రమంలో…. నో డౌట్, పూర్తి స్థాయి ఆధిపత్య ప్రదర్శన మనదే అన్న గట్టి నమ్మకంతో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ ఎలక్షన్స్కు మందు గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది. పార్టీ గుర్తులతో సంబంధం లేకున్నా…. ఆ ఫలితాలతో హ్యాపీగా ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఇక చాలా రోజులుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నా… కొన్ని అవరోధాలున్నాయి. బీసీ రిజర్వేషన్ విషయంలో క్లారిటీ కోసం ఎదురు చూస్తోంది ప్రభుత్వం. ఆ స్పష్టత వచ్చే వరకు ఆగుతారా లేదా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. అయితే… బీసీ రిజర్వేషన్స్ విషయంలో ఏదో ఒక ముందడుగు పడితేనే అటువైపు చూస్తారన్నది విస్తృతాభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో…. అంతకంటే ముందు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించవచ్చన్న టాక్ నడుస్తోంది. జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం కూడా బుధవారంతో ముగిసిపోయింది. అందుకే… ప్రభుత్వం స్పెషలాఫీసర్ని నియమించింది. దీంతో వీలైనంత త్వరగా గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్ని పూర్తి చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.
Read Also: Cambodia Cyber Scam: కేజీఎఫ్ను తలపించిన సైబర్ సామ్రాజ్యం.. వందల సంఖ్యలో ఉద్యోగులు!
గ్రేటర్ హైదరాబాద్ని మూడు కార్పొరేషన్స్గా విభజించి ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తూ వచ్చింది ప్రభుత్వం. మొదట జీహెచ్ఎంసీకి అనుకుని ఉన్న కార్పొరేషన్ లు, మున్సిపాలిటీలను విలీనం చేశారు. పరిధి పెంచి… మూడు విభాగాలుగా చేస్తూ… అధికారిక ఉత్తర్వులు కూడా వచ్చాయి. ఇవన్నీ… ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగుస్తున్న సందర్భంగా రావడంతో సర్కార్.. ఇక ఇక గ్రేటర్ ఎలక్షన్స్కు వెళ్తుందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెల రోజుల్లో వీటిని ఇంకా పెంచాలని భావిస్తోంది ప్రభుత్వం. దీంతో… ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల హడావుడి మొత్తం ముగిసిపోగానే గ్రేటర్ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలనుకుంటున్నారట కాంగ్రెస్ పెద్దలు. దీనికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈసారి ఎలాగైనా…. హైదరాబాద్ మీద పట్టుబిగించాలనే పట్టుదలతో ఉన్న సర్కార్ పెద్దలు… ప్రస్తుతం ఎన్నికలు జరిగిన చోట్ల మున్సిపల్ ఛైర్మన్స్, కార్పొరేషన్ మేయర్ల నియామకం ముగిసిన వెంటనే జీహెచ్ఎంసీ మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్రెడ్డి ఈ విషయంలో క్లారిటీగా ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఆ రకంగా మొత్తానికి… గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమవుతోంది సర్కార్. పాలక మండలి పదవీ కాలం ముగిసిన వెంటనే మూడు కార్పొరేషన్స్గా విభజిస్తూ ఆదేశాలు రావడంతో సర్కార్… వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు అర్థమవుతోందంటున్నారు పొలిటికల్ పండిట్స్.