Off The Record: వంగవీటి రాధాకు ఈసారి ఎమెల్సీ దక్కుతుందా?

  • 2004లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా రాధా గెలుపు..
  • 20 ఏళ్ళ తర్వాత తొలిసారి అధికారం ఉన్న పార్టీలో వంగవీటి..
  • రెండేళ్ళు అయినా ఏ పదవీ ఇవ్వలేదంటూ అనుచరుల అసహనం..
  • గతంలో వైసీపీ ఎమ్మెల్సీ ఆఫర్‌ ఇచ్చినా వెళ్ళలేదంటున్న సన్నిహితులు..
  • వంగవీటి రాధాకు ఈసారి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందేనని డిమాండ్స్‌..
  • వచ్చేనెల గవర్నర్‌ కోటాలో 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ..
  • ఆ ప్రస్తావన తీసుకు వస్తే అనుచరుల మీద రాధా సీరియస్‌?..
  • ఈసారి కారణాలు తెలుసుకోవాలని వత్తిడి చేసే ప్లాన్‌లో అనుచరగణం..
Otr Vangaveeti Radha Mlc

Otr Vangaveeti Radha Mlc

Off The Record: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు టీడీపీ ఈసారైనా ఎమ్మెల్సీ పదవి ఇస్తుందా లేక వాయిదాలు వేస్తుందా అన్న చర్చ ఇప్పుడు బెజవాడ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌ హాట్‌గా నడుస్తోంది. అలాగే ఆయన అనుచరగణం కూడా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. వంగవీటి రంగా వారసుడిగా 2004లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాధా…. తొలిసారి ప్రయత్నంలోనే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత… ఇప్పటివరకు ప్రతిపక్షంలోనే కొనసాగుతున్నారాయన. దాదాపు 20 ఏళ్ల తర్వాత… ఇప్పుడు అధికారంలో ఉన్నపార్టీలో కొనసాగుతున్నారు రాధా. గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ తరపున ప్రచారం చేశారాయన. అయితే… అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా… తమ నాయకుడికి ఏ పదవీ ఇవ్వలేదంటూ ఆయన అనుచరగణం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు వంగవీటి వైసీపీకి రాజీనామా చేసి… అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ… ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయింది. ఆ తర్వాత వైసీపీలో చేరాలని ఆఫర్లు వచ్చినా… అటువైపు చూడలేదన్నది ఆయన వర్గం చెబుతున్న మాట.

అప్పుడు ఆయనకు వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నా వెళ్ళలేదని, అలాంటి నేతను గుర్తించాలన్నది వంగవీటి వర్గం వాదన. 2024 ఎన్నికల్లో… టీడీపీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా 44 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేశారు మాజీ ఎమ్మెల్యే. 2019, 2024 రెండు ఎన్నికల్లో టికెట్‌ వదులుకుని పార్టీ కోసం పనిచేశారు కాబట్టి రాధాకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందేనని అంటున్నారు ఆయన సన్నిహితులు. అందుకు తగ్గట్టే…. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు కూడా… అధికారంలోకి వచ్చాక రాధాకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే…. మొదటి దఫాలో రాధాకు ఎమ్మెల్సీ ఇస్తారని భావించారు. అప్పుడు నలుగురుకి ఇచ్చినా….వంగవీటికి మాత్రం మొండి చేయే మిగిలింది. ఇప్పుడిక వచ్చే నెలలో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఆ రెండిటిలో ఒకటి కచ్చితంగా రాధాకి వస్తుందని ఆయన వర్గం ఆశపడుతోందట.

×
×
Ad

అయితే… ఇవన్నీ అనుచరుల ఆశలు, మాటలేగానీ… ఆయన వైపు నుంచి ఏ రియాక్షన్‌ లేదని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ సంగతేంటని ఒకవేళ అనుచరులు ఎవరైనా చొరవచేసి అడిగితే ఆయన సీరియస్ అవుతున్నట్టు సమాచారం. దాని గురించి తనను అడగవద్దని అంటున్నారన్నది ఇంటర్నల్‌ టాక్‌. మరోవైపు గతంలో ఎమ్మెల్సీ ఖాళీల భర్తీ తర్వాత సీఎం చంద్రబాబు రాధాను పిలిచి సమావేశమయ్యారు. అలాగే… ఈ మధ్యకాలంలో కూడా ఆయన సీఎంఓకి వెళ్లి బాబుతో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ పదవి విషయంలో ఏం మాట్లాడకుండా… రాధా అధిష్టానాన్ని కలుస్తుండటం కూడా చర్చనీయాంశంగా ఉంది. ఆయన వర్గం మాత్రం ఈసారి ఎమ్మెల్సీ అవకాశం దక్కక పోతే దాని వెనకున్న కారణాలేంటో తెలుసుకోవాలంటూ వత్తిడి పెంచే ఆలోచనలో ఉందట. పదవుల విషయంలో రాధాకు పెద్ద ఆసక్తి లేకున్నా…. ఆయన్ని ఉన్నత స్థానంలో చూడాలన్నది తమ అభిమతమని చెబుతున్నారు వంగవీటి అభిమానులు. ఈ పరిస్థితుల్లో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల భర్తీపై ఆసక్తి పెరుగుతోంది.