ఏపీలో బీజేపీకి ఓ సరదా సమస్య వచ్చి పడింది. ముఖ్యనేతల మీటింగ్లో అంతర్గత వ్యవహారాల చర్చ బయటకు వెళ్లిపోతుందట. పార్టీలో లోటుపాట్లు, నేతలకు అక్షింతలు సైతం మీడియాలో రావడంతో తలనొప్పిగా మారిందట. దీంతో పార్టీ సమావేశాల్లో అసలు చర్చ కంటే ముందు.. మీటింగ్ సీక్రసీపైనే ఎక్కువ చర్చ జరుగుతుందట. మీటింగ్ అంశాలు ఎవరూ బయట మాట్లాడొద్దని ఒట్టు వేయించుకున్నంత పని చేస్తున్నారట. ఎందుకో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
పార్టీ మీటింగ్లకు రహస్యం అవసరమని భావిస్తున్నారా?
ఏపీ బీజేపీ అంటేనే అదోరకం. ఒక్కోసారి ఉధృతంగా కార్యక్రమాలు చేస్తారు. మరో సందర్భంలో పూర్తిగా సైలెంట్ అయిపోతారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తరువాత ప్రజా సమస్యలపై పోరాటం పెంచారు. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర ఇంచార్జ్లతోపాటు అగ్రనేతలు సమావేశాలు నిర్వహించారు. ముఖ్యులు మాత్రమే హాజరయ్యే ఈ మీటింగ్లలో పార్టీ లోటుపాట్లతో పాటు.. భవిష్యత్ ప్రణాళిక చర్చించారట. ఇంత వరకు బాగానే ఉన్నా.. పార్టీ మీటింగ్ల విషయంలో మరింత రహస్యం అవసరమని భావించడం చర్చకు దారితీస్తోంది. ఇందుకోసం వారు తీసుకుంటున్న చర్యలు ఆసక్తిగా మారాయని చెబుతున్నారు.
అంతర్గత సమావేశాల లీకేజీపైనే ఎక్కువ చర్చ జరిగిందట
విజయవాడలో కొద్దిరోజుల క్రితం బీజేపీ ముఖ్యనేతల మీటింగ్ జరిగింది. దీనికి కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్ హాజరయ్యారు. కొత్తగా చార్జ్ తీసుకున్న జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ సింగ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయన పరిధిలో ఉండే 5 రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. గతంలో సతీష్ ఉండగా…ఇప్పుడు అదే ప్లేస్లో శివ ప్రకాష్ సింగ్ వచ్చారు. ఆయనను పరిచయం చేసేందుకు ఈ భేటీ పెట్టుకున్నారు. సోము వీర్రాజు, పురందేశ్వరి, సత్యకుమార్లతోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరుకాగా.. ఏపీలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలపై పోరాటాలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారట. అయితే ఈ చర్చలన్నిటి కంటే ముందు పార్టీ అంతర్గత సమావేశాల సమాచారం లీక్ అవుతున్న అంశంపై ఎక్కువ చర్చ జరిగిందట.
డ్యామేజీ అవుతున్నామన్న ఫీల్ నేతల్లో ఉందా?
పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ స్థాయి నేతలు పాల్గొనే మీటింగ్లలో తప్పొప్పుల ప్రస్తావన ఉంటుంది. కీలకమైన అంశాలపై క్లాస్ కూడా తీసుకుంటారు. అయితే ఇవన్నీ బయటకు పొక్కడంపై పార్టీలో అసంతృప్తి ఉంది. లీకుల వల్ల అసలు విషయాలకంటే అనవసర అంశాలపైకి పార్టీలో ఎక్కువ చర్చ జరిగి డ్యామేజ్ అవుతున్నామన్న ఫీల్ నేతల్లో ఉందట. దీంతో మొన్న విజయవాడలో జరిగిన సమావేశంలో మీటింగ్ తరువాత ఎవరూ మాట్లాడకూడదు అని గట్టిగా నొక్కి చెప్పారట. ఒట్టు ఒక్కటి వేయించుకోలేదు గానీ.. దాదాపు అంత వరకు చర్చ వెళ్లింది అంటున్నారు పార్టీ నేతలు.
ముందుగా చర్చించుకున్న అజెండానే మీడియాకు చెప్పారా?
పార్టీ అంతర్గత సమాచారం బయటకు పొక్కడం సరికాదు అనే ఆలోచన మంచిదే అయినా.. ప్రజా సమస్యలపై ఏం చేస్తామో కూడా చెప్పకపోతే ఎలా అని కొందరు అభిప్రాయపడ్డారట. ఆ మీటింగ్ ముగిసిన తరువాత ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్ మీడియాతో పలు వివరాలు పంచుకున్నారు. అది కూడా ముందుగా చర్చించుకున్న అజెండా అంశాల వరకు మాత్రమే.
లీకువీరులకే ఆ విషయాలు ప్రత్యేకంగా చెప్పారా?
నిర్ధేశించిన వారు తప్ప ఇతర నేతలు ఎవరూ మీడియాతో మాట్లాడ వద్దని.. లీకులు ఇస్తే ఊరుకునేది లేదని కాస్త కటువుగానే చెప్పారట పార్టీ పెద్దలు. లీకు వీరులు వారే అనుకున్నారో ఏమో.. కానీ.. ఈ విషయంలో కొందరు నేతలకు మరీ ప్రత్యేకంగా చెప్పినట్లు సమాచారం. మీటింగ్లలో అక్షింతల వ్యవహారాలు బయటకు రావడం అవమానంగా భావిస్తున్న నాయకులు.. ఈ కొత్త ప్రమాణాలను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి కోఇంచార్జ్గా ఉన్న సునీల్ దేవధర్ ఈ విషయంలో లీడ్ తీసుకున్నారని చెపుతున్నారు. మరి.. ఇలా నేతలను ఎంత కాలం కట్టడి చేస్తారో చూడాలి.