కొత్త బాస్ లు వచ్చాక కొత్త పనులు జరగటం సహజమే. తెలంగాణలో నలుగురు కొత్త పోలీస్ కమీషనర్ లు దూకుడు పెంచారట. అధికారుల బదిలీలతో పాటు, విధినిర్వహణపై ఒత్తిడి కూడా పెంచారట. ఇది డిపార్ట్మెంట్ లో కలకలానికి కారణమైందట..
పోలీస్ డ్యూటీ అంటే కత్తి మీద సాము లాంటిది. ఎప్పుడు ఎక్కడ ఏ పోస్టింగ్ చేయాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. ఊహించని రీతిలో ప్రభుత్వం నాలుగు పోలీస్ కమిషనరేట్ లకు కొత్త గా అధికారులను నియమించింది. కొత్త కమిషనర్ లు వచ్చీ రాగానే దూకుడు పెంచారు. సిబ్బంది బదిలీలు మొదలు పెట్టడంతో, డిపార్ట్ మెంట్ లో కలకలం కనిపిస్తోంది.
కొత్త నీరు రాగానే పాత నీరు వెళ్ళిపోతుంది. పోలీస్ శాఖకు కూడా ఇదే వర్తిస్తుంది. ఎస్పీ తో పాటు పోలీస్ కమిషనర్ రాగానే గతంలో పని చేసిన అధికారులను బదిలీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ప్రభుత్వం 4 పోలీస్ కమిషనరేట్ లకు కొత్తగా అధికారులను నియమించింది. కొన్నాళ్ళ క్రితం వరంగల్ పోలీస్ కమిషనర్ గా తరుణ్ జోషి నియమించింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా సత్యనారాయణ నియమించారు. రామగుండం పోలీస్ కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డికి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్ర కు పోస్టింగ్ ఇచ్చారు. ఈ నలుగురు పోలీస్ కమిషనర్ లు వచ్చీ రాగానే దూకుడు పెంచారు.
కొత్త కమీషనర్ లు ఇప్పటికే పాత సిబ్బందికి మంగళం పాడుతున్నారట. ఇప్పటికే వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ బదిలీ ప్రక్రియ మొదలుపెట్టారు. చాలా కాలం నుంచి ఎక్కడో లూప్ లైన్ లో పనిచేస్తున్న అధికారులకు మంచి పోస్టింగ్ ఇచ్చారు. అటు పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు అధికారులంతా బదిలీ అయ్యారు. రామగుండం లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. కరీంనగర్లో కూడా పాత అధికారుల్ని బదిలీ చేసి కొత్తవారికి పోస్టింగ్ ఇస్తున్నారు. ఇకపోతే ఊహించని రీతిలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ బదిలీ అయ్యారు. ఈ స్థానానికి స్టీఫెన్ రవీంద్ర ను తీసుకు వచ్చారు.
స్టీఫెన్ రవీంద్ర వచ్చీ రాగానే తన పనితీరును మొదలు పెట్టారు. చాలా వరకు స్టేషన్ ఇంచార్జి అధికారులు బదిలీ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది పోలీసు అధికారులు రేంజ్ కు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. దీనికోసం అధికారులకు విన్నపాలు వెళ్తున్నట్టుగా సమాచారం. ఇటీవల కాలంలో స్టీఫెన్ రవీంద్ర లా అండ్ ఆర్డర్ సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ కేసులు పెరిగిపోయిన పోలీస్ స్టేషన్ల అధికారులకు షెడ్యూల్ ఫిక్స్ చేశారు. నిర్ణీత టైం లోగా కేసులను సాల్వ్ చేయాలని, చార్జిషీటు వేయాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు విచారణ పై దృష్టి పెట్టి వెంటనే కేసులను సాల్వ్ చేయాలని సైబరాబాద్ కొత్త కమీషనర్ ఆదేశించారట.