YV Subba Reddy: వైసీపీ అభ్యర్థుల గురించి ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా ప్రస్తుతానికి సమన్వయకర్తలు మాత్రమేనని.. తుది జాబితాలో చోటు దక్కిన వాళ్లే అభ్యర్థులు అని ఆయన తేల్చి చెప్పారు. ఆఖరి సిద్ధం సభ తర్వాత అభ్యర్థుల తుది జాబితా, మేనిఫెస్టో విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. సుదీర్ఘ కసరత్తు చేసే అవసరం చంద్రబాబుకు వచ్చిందంటేనే వైసీపీ అభ్యర్దులు ఎంత బలంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. టీడీపీకి ఇప్పటికీ 40 స్థానాల వరకు అభ్యర్థులు లేరని వెతుక్కునే పనుల్లో ఉన్నారన్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: టీడీపీ-జనసేన పొత్తులో బలహీనత కనిపిస్తోంది.. సజ్జల సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర భవిష్యత్ కోసం కాకుండా చంద్రబాబు కళ్ళలో బంగారు భవిష్యత్ చూడడానికే పవన్ కళ్యాణ్ 24 సీట్లకే పరిమితం అయ్యారని వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. అరాచక అభ్యర్థులకు టికెట్ ఇచ్చే సంస్కృతి వైసీపీకి లేదన్నారు. మా వల్ల మేలు జరిగితేనే మళ్లీ మాకు ఓటు వేయమని చెప్పే ధైర్యం జగన్కు తప్ప ఇంకెవరికైనా ఉందా అంటూ ప్రశ్నించారు. షర్మిల వచ్చినంత మాత్రాన రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ను ఎవరూ పట్టించుకోరన్నారు. ఎన్ని కూటములు వచ్చినా అంతిమంగా విజయం వైసీపీదేనని వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.