భారత్, శ్రీలంక ఆతిథ్యంలో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 సెప్టెంబర్ 30 నుంచి ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని టీమ్స్ తమ స్క్వాడ్లను ప్రకటించాయి. అంపైర్లు, మ్యాచ్ రిఫరీల ప్యానెల్ను తాజాగా ఐసీసీ ప్రకటించింది. ప్యానల్లో 14 మంది అంపైర్లు, నలుగురు మ్యాచ్ రెఫరీలు ఉన్నారు. ప్యానల్లో మొత్తంగా 18 మంది ఉండగా.. అందరూ మహిళలే కావడం విశేషం. తొలిసారి పూర్తి స్థాయిలో మహిళలతో మెగా ఈవెంట్ను నిర్వహించడం టోర్నీ చరిత్రలోనే ఇదే మొదటిసారి.
మహిళల టీ20 ప్రపంచకప్, కామన్వెల్త్ గేమ్స్లో మహిళా అంపైర్లు, రిఫరీలను ఐసీసీ నియమించింది. అయితే పూర్తి స్థాయిలో మహిళలు ఉండడం ప్రపంచకప్లో మాత్రం ఇదే మొదటి సారి. టోర్నమెంట్లోని 31 మ్యాచ్లలో 14 మంది మహిళా అంపైర్లు, నలుగురు రిఫరీలు తమ సేవలను అందిచనున్నారు. ఇది మహిళా క్రికెట్ ప్రయాణంలో ఓ చరిత్రాత్మకమైన మార్పు అని ఐసీసీ ఛైర్మన్ జై షా అన్నారు. ఈ ముందడుగు కొత్త ఒరవడికి మార్గం సుగమం చేస్తుందని తాను ఆశిస్తున్నా అని తెలిపారు. ఇది కేవలం మైలురాయి మాత్రమే కాదని.. క్రికెట్లో స్త్రీ, పురుష సమానత్వాన్ని పెంపొందించడానికి ఐసీసీ చూపుతున్న నిబద్ధతకు ప్రతిబింబం అని జై షా పేర్కొన్నారు.
ఆస్ట్రేలియన్ క్లైర్ పోలోసాక్, జమైకన్ జాక్వెలిన్ విలియమ్స్, ఇంగ్లీష్ ఉమెన్ సూ రెడ్ఫెర్న్కు ఇది మూడవ మహిళల ప్రపంచకప్. లారెన్ అగెన్బాగ్, కిమ్ కాటన్లు రెండవ ప్రపంచకప్లో పాల్గొంటున్నారు. అనుభవజ్ఞులు, కొత్త వారితో ప్యానల్ సమతూకంగా ఉంది. టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. టోర్నీ మొదటి మ్యాచ్లో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్లు శ్రీలంకలో జరుగుతాయి.
Also Read: Kuldeep Yadav: కష్టాన్నే నమ్ముకున్న కుల్దీప్.. ఒక్కమాట అనలేదు! చివరకు బెండు తీశాడు
ప్రపంచకప్ ప్యానెల్:
మ్యాచ్ రిఫరీలు: ట్రూడీ అండర్సన్, షాండ్రే ఫ్రిట్జ్, జీఎస్ లక్ష్మి, మిచెల్ పెరీరా.
అంపైర్లు: లారెన్ అజెన్బాగ్, కాండేస్ లా బోర్డే, కిమ్ కాటన్, సారా దంబనేవానా, షతీరా జాకీర్ జెస్సీ, కెర్రిన్ క్లాస్టే, జనని ఎన్, నిమాలి పెరెరా, క్లైర్ పోలోసాక్, బృందా రాఠీ, స్యూ రెడ్ఫెర్న్, ఎలోయిస్ షెరిడాన్, గాయత్రి వేణుగోపాలన్, జాక్వెలైన్స్.