ఉమ్మడి మెదక్ జిల్లాలో చేతబడి పేరుతో హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో తోడబుట్టిన వాళ్ళను హత్య చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో రెండు దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. సాంకేతిక యుగంలోనూ మూఢ నమ్మకాలను బలంగా నమ్ముతున్నారు జనం. ఏదైనా రోగం వస్తే మంత్రాలతోనే వచ్చిందని నమ్ముతున్నారు. ఈ నెల11న మెదక్ జిల్లా కొల్చారం మండలం వస్రాం తండాలో తన కుటుంబానికి చేతబడి చేశాడని.. మంక్త్యా నాయక్ని తమ్ముడు మోహన్ అతి కిరాతకంగా బాండ రాళ్లతో మోది.. కల్లు సీసాలతో పొడిచి హత్య చేశాడు. నిన్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో చేతబడులు చేస్తున్నాడని తాజుద్దీన్ అనే యువకుని హసన్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేశాడు.
READ MORE: Supreme Court: భార్య ఫోన్ రికార్డ్ చేయడం తప్పేం కాదు, సాక్ష్యంగా పరిగణించవచ్చు.
మంక్త్యా నాయక్ని తమ్ముడు ఎలా చంపాడు..
మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. తొడబుట్టిన వాళ్లనే కాటికి పంపుతున్నారు కొందరు దుర్మార్గులు. మెదక్ జిల్లాలో చేతబడులు చేస్తున్నాడని అనుమానంతో సొంత అన్ననే కిరాతకంగా హత్య చేశాడు తమ్ముడు. కసి తీరా పీక కోసి కూల్ అయ్యాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల పేర్లు మంక్త్యా నాయక్, మోహన్ నాయక్. ఇద్దరు సొంత అన్నదమ్ములు.. సీన్ కట్ చేస్తే ఇగో ఇలా అన్న.. మంక్త్యా నాయక్ని తమ్ముడు మోహన్ అతి కిరాతకంగా బాండ రాళ్లతో మోది.. కల్లు సీసాలతో పొడిచి హత్య చేశాడు. కసి తీరా పీక కోశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నా వదలకుండా తన వద్ద ఉన్న టవల్తో మెడ చుట్టూ ఉరివేసి చంపాడు…
READ MORE: Chicken: ఎక్స్ట్రా “చికెన్” కావాలన్నందుకు ఫ్రెండ్నే చంపేశాడు..
మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసానిపల్లి పరిధి వస్రాం తండాకు చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లకు గత కొంతకాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. అలాగే ఈ మధ్యే మోహన్ నాయక్ మనవరాలు అనారోగ్యంతో చనిపోయింది. ఇంట్లో సమస్యల కారణంతో ఓ తాంత్రికుడి దగ్గరికి వెళ్తే మీ అన్నే మనవరాలు మృతికి కారణం అని చెప్పాడు. దీంతో అన్న మంక్త్యాపై మోహన్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అన్నని చంపాలని నెల రోజులుగా పగతో రగిలిపోతున్నాడు మోహన్.
READ MORE: Ahmedabad Plane Crash: పరిహారం కాదు.. జవాబుదారీతనం కావాలి.. నివేదికపై బాధిత కుటుంబాలు ఆందోళన
ఈ క్రమంలో ఇద్దరూ తండాలోని కల్లు డిపో వద్ద కల్లు తాగడానికి వచ్చారు. అన్నని చూసి ఆగ్రహంతో రగిలిపోయాడు తమ్ముడు. ఇద్దరి మధ్య చిన్నగా గొడవ మొదలైంది. గొడవ కాస్త చినికి గాలివానలా మారింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్నారు. తమ్ముడు మోహన్ అక్కడే ఉన్న బండరాళ్లతో తలపై కొట్టి…కల్లు సీసాలతో మంక్త్యా కడుపులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మంక్త్యా కుప్పకూలాడు. అయినా మోహన్ ఇంకా అన్నని కొడుతూనే ఉన్నాడు. ఈ ఘటన అంతా అక్కడున్న వారు వీడియో తీస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా అడ్డుకునే యత్నం చేయలేదు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మోహన్ని అదుపులోకి తీసుకున్నారు. మంక్త్యా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మార్చురీ వద్దకు చేరుకుని బోరున విలపించారు. తమ్ముడే కాల యముడిలా మారుతాడని కలలో కూడా అనుకోలేదని మృతుడి భార్య రోదించిన తీరు అందరిని కన్నీరు పెట్టించింది..